ఇవాళ ఒక్క సీటే రేపు అసెంబ్లీ మొత్తం జనసేనదే..!
- IndiaGlitz, [Tuesday,August 06 2019]
‘నన్ను ప్రాణప్రదంగా చూసే ఒక్క జనసైనికుడు పక్కన ఉన్నా పార్టీని నడుపుతాను. నేడు ఒకే ఒక్క ఎమ్మెల్యే.... అది ఏదో ఒక రోజు వామనుడు ఎదిగిన చందంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఆక్రమించేలా చేస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్నారు. భీమవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉండి రోడ్డులోని కోట్ల ఫంక్షన్ హాల్లో నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఓటమి అనంతరం- పీఆర్పీకి ఎలాంటి పరిస్థితులు సృష్టించారో నా వద్ద అలాంటి ప్రస్తావనలే మొదలుపెట్టారు. చిరంజీవిగారి మెత్తదనం వల్ల వెంటనే చేశారు. నా దగ్గర నెల రోజుల తర్వాత అలాంటి ప్రస్తావన తెచ్చారు.
ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ చేయం. జనసేన మీద నాయకులకు నమ్మకం లేకపోతే వెళ్లిపోవచ్చు. దయచేసి నన్ను ప్రలోభపెట్టాలని చూడకండి. పోతే ప్రాణాలు పోగొట్టుకుంటాం గానీ ఒకసారి జరిగిన పొరపాటు రెండోసారి చేయం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచిస్తూ కూర్చోను. అవసరం అయితే నేను ఒక్కడినే నిలబడగలను. ఆ ధైర్యం, సత్తా నాకు ఉన్నాయి. చాలా మంది మీకు క్షేత్ర స్థాయిలో అవగాహన లేదు అంటున్నారు. ప్రజల కష్టాల మీద అవగాహన, బాధ లేకుంటే పార్టీ పెట్టగలనా? నా కోసం అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్లిపోగలను. అసెంబ్లీలో ప్రజల తరఫున బలమైన పోరాటం చేసే వ్యక్తులు,సమస్యలపై ఎదురొడ్డి పోరాడే వ్యక్తులు కావాలి అన్న సదుద్దేశంతోనే జనసేన పార్టీ స్థాపించాను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
నాకు తోడుగా ఉంటే...!
2014లో నన్ను అర్ధం చేసుకున్న నాయకులు అయిదుగురు నాకు తోడుగా ఉంటే ఈ పాటికి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి ఉండేది. నన్ను మీరు అర్ధం చేసుకున్నట్టు నాయకులు అర్ధం చేసుకుని ఉంటే కనీసం అసెంబ్లీలో బలమైన స్థానంలో ఉండేవాళ్లం. జనసేన పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడనటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. వారిని అనుసంధానం చేసే నాయకులు ఉంటే పార్టీ పరిస్థితి వేరుగా ఉండేది. నియోజకవర్గ ఇన్ చార్జీలుగా బాధ్యతలు తీసుకున్న నాయకులంతా కార్యకర్తలకు మరింత చేరువగా వెళ్లాలి అని పవన్ సూచించారు