తీవ్ర ఉత్కంఠ మధ్య జయేష్ రంజన్ గెలుపు

  • IndiaGlitz, [Monday,February 10 2020]

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం జయేష్ రంజన్-రంగారావులు పోటీ పడ్డారు. అయితే.. మొదట జయేష్ రంజన్‌కు చెందిన ప్యానెల్ సభ్యులు ఒక్కొక్కరుగా ఓడినప్పటికీ చివరికి అధ్యక్షుడిగా ఆయనే గెలిచారు. మొత్తం ఓట్లలో రంజన్‌కు 46 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి రంగారావుకు 33 ఓట్లు మాత్రమే పోలవ్వడంతో 13ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు అసోసియేషన్ ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. జయేష్ రంజన్‌తో పాటు వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థులు మహ్మద్ అలీ, ప్రేమ్‌రాజ్, సరల్ తల్వార్, వేణుగోపాలచారి సైతం గెలుపొందారు.

మొదట తడబడి.. తర్వాత..!
వాస్తవానికి అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అంతా భావించినప్పటికీ రంగారావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రంగంలోకి దిగడం సీన్ మొత్తం మారిపోయింది. దీంతో ఎన్నిక తప్పనిసరి అయ్యింది. అయితే నామినేషన్ వేసిన రంజన్ రిజెక్ట్ కావడంతో ప్రత్యర్థులకు మరింత చాన్స్ వచ్చినట్లయ్యింది. ఈ షాక్ నుంచి తేరుకోకమునుపే శుభవార్త రావడంతో ఫ్యానల్ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఫలితాలప్పుడు కూడా మొదట నలుగురు ఈ ఫ్యానెల్ సభ్యులు ఓటమిపాలవ్వడంతో ఇక రంజన్ కూడా కచ్చితంగా ఓడిపోతారని ప్రత్యర్థులకు ధీమా వచ్చేసింది. అయితే కాసేపటికే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఫైనల్‌గా 13ఓట్ల తేడాతో రంజన్ విజయం సాధించారు. అయితే ఆయన ఫ్యానెల్‌కు కీలక వ్యక్తులు ఓడిపోవడం గమానర్హం. మరి వివాదాలు లేకుండా అసోసియేషన్‌లో ఏ మాత్రం నడుచుకుంటారో వేచి చూడాల్సిందే.

కాగా.. కలెక్టర్‌తో పాటు పలు ఉన్నత పదవులు అనుభవించిన రంజన్.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నమ్మినబంటు అని చెబుతుంటారు. అందుకే ఆయన్ను ఈ ఎన్నికల్లో కేటీఆర్ బరిలోకి దింపారని సమాచారం. ప్రస్తుతం జయేష్ తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం విదితమే.