కల్యాణ్ రామ్ కి కూడా కలిసొస్తుందా?

  • IndiaGlitz, [Saturday,January 20 2018]

'ఇజం' త‌రువాత చిన్న‌ విరామం తీసుకుని.. సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా జై ల‌వ కుశ చిత్రాన్ని నిర్మించారు క‌థానాయ‌కుడు క‌ల్యాణ్ రామ్‌. ఆ త‌రువాత.. రెండు చిత్రాల‌లో క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ బిజీగా మారిపోయారు. ఆ రెండు చిత్రాలే 'ఎం.ఎల్‌.ఎ'(మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ్‌), 'నా నువ్వే'. వీటిలో 'ఎం.ఎల్‌.ఎ 'ముందుగా విడుద‌ల కానుంది. ఉపేంద్ర మాధ‌వ్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ సినిమాలో.. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని మార్చి 28న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచార‌మ్‌. అదే గ‌నుక జ‌రిగితే.. బాల‌కృష్ణ‌, జూ.ఎన్టీఆర్ కి క‌లిసొచ్చిన ఆ తేది క‌ల్యాణ్ రామ్ కి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. తార‌క్‌కి తొలి సూప‌ర్ హిట్‌ని అందించిన 'ఆది' 2002లో ఇదే మార్చి 28న విడుద‌లైంది. ఇక సింహా త‌రువాత స‌రైన విజ‌యం లేని బాల‌య్య‌కి 2014లో ఇదే మార్చి 28న రిలీజైన 'లెజెండ్' మంచి విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో 'ప‌టాస్' త‌రువాత స‌రైన విజ‌యం లేని క‌ల్యాణ్ రామ్‌కి కూడా మార్చి 28 క‌లిసొస్తుందేమో చూడాలి.