close
Choose your channels

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య..

Tuesday, December 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్‌మగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ పక్కన ధర్మేగౌడ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం ధర్మేగౌడ ఇంటి నుంచి ఒంటరిగా కారులో వెళ్లిపోయారు. ఆయన కోసం గన్‌మెన్, పోలీసులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

కాగా.. గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఓ మృతదేహం ఉందన్న సమాచారం రైల్వే పోలీసులకు అందింది. వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా.. అది ధర్మేగౌడది అని తేలింది. ఆయన పక్కనే ఒక సూసైడ్ లెటర్ లభించడంతో ఆత్మహత్య అని నిర్ధారించారు. ధర్మేగౌడ మృతిపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి కర్ణాటకకు తీరని లోటుగా రాజకీయ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.

ఇదిలాఉండగా, ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో హైడ్రామా చోటు చేసుకుంది. చైర్మన్ కె. ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభ్యులు సభాపతి స్థానంలో ఉన్న ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. ఈ ఘటనతో డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ తీవ్ర మనస్తానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దర్మేగౌడ ఆత్మహత్య కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.