ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్

  • IndiaGlitz, [Monday,August 10 2020]

అటు ఏపీ.. ఇటు కేంద్ర ప్రభుత్వాలపై నేడు సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానాన్ని అవలంభిస్తోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు.

ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షుణ్ణంగ పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై చర్చించారు.

పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా..

‘‘నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాము. వృథాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదు..

‘‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతున్నది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

కొత్త ప్రాజెక్టులనడం అవివేకం.. అర్థరహితం..

‘‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యి ఉన్నాయి. వాటికి నీటి కేటాయింపులు జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు 23 వేల కోట్ల రూపాయల వరకు నిధుల ఖర్చు జరిగింది. 31,500 ఎకరాల భూ సేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థ రహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంజూరయినప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీని వల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీడిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

More News

హీరో సూర్య‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌..?

అటు త‌మిళ ఇటు తెలుగులో త‌న సినిమాల‌కు ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒక‌రు.

మాన‌సిక స‌మ‌స్య‌తో నాని..?

అదేంటి?  నేచుర‌ల్ స్టార్ నానికి మాన‌సిక స‌మ‌స్యా? అని అనుకోకండి.

ఎన్‌.శంక‌ర్ భూముల వ్య‌వ‌హారంలో వివ‌ర‌ణ అడిగిన హైకోర్టు

గత ఏడాది టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స్టూడియో నిర్మాణానికి త‌క్కువ ధ‌ర‌కు భూములు ఇచ్చారు.

ర‌వితేజ నెక్ట్స్ మూవీ రీమేకా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ‘క్రాక్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌.

ఏడాది వెన‌క్కి వెళ్లిన ఆమిర్ ఖాన్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డుతున్నాయి. ఇప్పుడు ఈ కోవ‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చ‌ద్దా’ కూడా చేరింది.