తెలంగాణ రైతులకు త్వరలోనే కేసీఆర్ తీపికబురు

  • IndiaGlitz, [Friday,May 29 2020]

తెలంగాణ రైతులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశం కూడా ఆశ్చర్యపోయేలా ఆ విషయం చెబుతామన్నారు. శుక్రవారం నాడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌‌ను సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ పలు విషయాలు పంచుకున్నారు.

త్వరలోనే పూర్తి..

‘కాళేశ్వరం అపురూపమైన ప్రాజెక్ట్. తెలంగాణ ప్రజలకు ఇది అపురూప ఘట్టం. తెలంగాణ కల సాకారమైంది. కాళేశ్వరం కోసం భూములిచ్చిన వారి త్యాగాలు వెలకట్టలేనివి. భూములు కోల్పోయినవారికి పునరావాసం కల్పించాం. గజ్వేల్ పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్ టౌన్ రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు నీళ్లు వస్తాయి. మహారాష్ట్రతో ఒప్పందం సక్సెస్ అయ్యింది. గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. రూ. 4వేల కోట్లతో 1250 చెక్ డ్యామ్‌లు నిర్మిస్తున్నాం. బయో డైవర్శిటీని అభివృద్ధి చేస్తాం’ అని రైతన్నలకు కేసీఆర్ అభయమిచ్చారు.

ఇవాళ మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంప్ చేయడానికి కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేసిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సముద్ర మట్టానికి 530 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మర్కుక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామితో కలిసి మోటార్లు ప్రారంభించగా, పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతల విధానంలో జలజలా ముందుకు ఉరికాయి.