close
Choose your channels

జీహెచ్ఎంసీనా మజాకా.. కేంద్రంపైనే యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్..

Monday, December 7, 2020 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జీహెచ్ఎంసీనా మజాకా.. కేంద్రంపైనే యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్..

తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎదిగిపోవడం.. అటు దుబ్బాకలోనూ.. ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను అనూహ్యంగా దెబ్బతీయడం వంటి అంశాలు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నారో ఏమో కానీ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వెళ్లింది లేదు. ఇక మీదట బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం విషయంలో మిన్నకుండి పోతే అది మరిన్ని ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. దీంతో ఇటు రాష్ట్రం.. అటు కేంద్రంలోనూ బీజేపీని ఢీకొట్టే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న రైతుల పోరుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతేకాదు.. మంగళవారం జరిగే భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రహిత ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు సైతం కేసీఆర్ అంతర్గతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రగతి భవన్ వర్గాలు ఖండిచాయి. కానీ కేసీఆర్‌ తనకు ప్రత్యేకంగా ఫోన్‌ చేశారని, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించి జరిగే సభలో భాగస్వాములు కావాలని కోరారని జేడీఎస్‌ ముఖ్య నేత కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. మరోవైపు డిసెంబర్ రెండవ వారంలో హైదరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. కేసీఆర్‌ తన వైఖరి మార్చుకుని మరీ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

బీజేపీకి అస్త్రమవ్వొద్దనే...

గ్రేటర్ మేయర్ పదవి విషయంలో మజ్లిస్ మద్దతు కోరవద్దని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీతోనే నేరుగా టీఆర్‌ఎస్‌ పోరాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ స్థానానికి త్వరలోనే ఉపఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మజ్లిస్‌ మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే అది బీజేపీకి అస్త్రంగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే మజ్లిస్‌తో వ్యూహాత్మక దూరం పాటించాలని నిర్ణయించినట్టు సమాచారం. సాగర్‌ ఉప ఎన్నిక తర్వాతే గ్రేటర్‌ మేయర్‌ పీఠం గురించి ఆలోచించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల యోచనకు పదును పెడుతున్న ఈ తరుణంలో మజ్లిస్‌ మద్దతు ఇబ్బందికరంగా మారుతుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.