మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నిర్మాత
- IndiaGlitz, [Tuesday,October 15 2019]
నిర్మాత కె.కె.రాధామోహన్ ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ను నిర్మించినా ఈయనకు లక్ కలిసి రావడం లేదు. అయినా కూడా ఈయన పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. ఇటీవల సూర్య 'ఎన్.జి.కె' సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు సూర్య సోదరుడు కార్తి తాజా చిత్రం 'ఖైదీ' తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నాడు.
కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోడ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ పతకాలపై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుపూర్ వివేక్ నిర్మించిన చిత్రం 'ఖైదీ'. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం 'ఖైదీ' టైటిల్తోనే రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైన గుడ్ రెస్పాన్స్ను రాబట్టుకుంది. శామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నరైన్, దీనా, మరియం జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మరి 'ఖైదీ' సినిమాతో అయినా రాధామోహన్ హిట్ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో హీరోయిన్, సాంగ్స్లాంటి లేకుండా దర్శకుడు లోకేష్ సినిమాను తెరకెక్కించాడు.