‘పల్నాటి పులి’ కోడెల కన్నుమూత.. ట్విస్ట్ ఏంటంటే..! 

  • IndiaGlitz, [Monday,September 16 2019]

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ కీలక నేత, రాజకీయ ఉద్ధండుడిగా పేరుగాంచిన కోడెల శివప్రసాద్ (72) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం నాడు హైదరాబాద్‌లోని తన సొంతిట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకురాగానే.. వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. వైద్యం తీసుకుంటూనే ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల కన్నుమూశారన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కోడెల వీరాభిమానులు, టీడీపీ శ్రేణులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు. అయితే రాజకీయ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా కోడెలను కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఇలా వరుస వివాదాలతో ఏం చేయాలో దిక్కుతోచక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..
కొడుకు శివరాంతో గొడవ కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కథనాలు వస్తుండటం గమనార్హం. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ఆయన.. కొన్ని రోజులక్రితం గుండెపోటుకు గురైన సంగతి తెలిసందే. ఇక కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తె భూ దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్‌ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటుంటగా ఈ వ్యవహారాలన్నీ వెలికి తీసిన ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అటుంచితే.. కోడెల ఆత్మహత్య చేసుకోగా.. ఆస్పత్రికి తరలించారని వార్తలు రావడం గమనార్హం. కొడుకుతో గొడవలు, ఆస్పత్రికి తరలించారని ఇలా పలు రకాల ట్విస్ట్‌లు వెలుగు చూస్తుండటం గమనార్హం.

పల్నాటి పులిగా..!
కాగా.. కోడెలను అభిమానులు ముద్దుగా ‘పల్నాటి పులి’గా పిలుచుకుంటారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. కోడెలకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు.

రాజకీయ నేపథ్యం..!

1983, 85, 89, 1994, 2014లో నరసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు.
2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు.
1987-88 మధ్యలో హోంమంత్రిగా పనిచేశారు
1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా పనిచేశారు...
1997-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా పనిచేశారు.
2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో కోడెల ఓడిపోయారు.. ఎన్నికల రోజున కోడెలపై దాడి కూడా జరిగింది. కాగా.. కోడెల మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. కోడెల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అధిష్టానం హామీ ఇచ్చింది.