close
Choose your channels

పీఎం సహాయ నిధికి కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

Monday, April 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పీఎం సహాయ నిధికి కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు. కాగా తన ఫ్యామిలీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారని.. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివని వ్యాఖ్యానించారు. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు
అందజేస్తున్నారని తెలిపారు.

ఇదీ మా కుటుంబ సాయం..!

‘మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు ఇస్తామని ముందుకొచ్చారు. అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి మన ప్రియతమ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, నిన్న ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్న నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని రెబల్ స్టార్ అన్నారు.

కాగా.. ఇదివరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీగా విరాళాలు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. కృష్ణంరాజుకు బీజేపీకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్.. బీజేపీ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారన్న విషయం విదితమే. ఇప్పటికీ ఆయన కాషాయపార్టీలోనే కొనసాగుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రధాని మోదీని కలవాలంటే ఎలాంటి అపాయిట్మెంట్ లేకుండానే నేరుగా కలిసేంత చనువు ఆయనకుంది. ఇప్పటికే పలుమార్లు తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.