‘కాంగ్రెస్‌ను తీసి పారేయలేం.. జగన్‌తో మంచి సంబంధాలున్నాయ్’

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసిపారేయలేమని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు మంచి సంబంధాలున్నాయని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ రోజున తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడమే కాకుండా.. మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న, ఎన్నో ఒడిదుడుకులు చూసిన కాంగ్రెస్ పార్టీని తీసిపారేయడానికి వీల్లేదని.. ఒకట్రెండు విజయాలు రాగానే తామేమీ ఎగిరిపడటం లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ కలిసి పోటీ చేయదని స్పష్టం చేశారు. మా రెండు పార్టీల మధ్య స్నేహపూరిత సంబంధాలున్నప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. 2019వ సంవత్సరం తమ పార్టీకి మంచి ఆరంభం ఇచ్చిందని.. 2020లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో శుభారంభం చేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీకి అంత సీన్‌ లేదు!
‘రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్‌ లేదు.. ఈ విషయంలో కమలనాథులకు తెలుసు. నా చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో మా ప్రత్యర్థి కాంగ్రెస్సే. మున్సిపోల్స్‌లో అన్ని పార్టీల కంటే ముందే ఉన్నా్ం. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం. కొత్త పురపాలక చట్టం సక్రమంగా అమలు చేయడమే లక్ష్యం. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణం పూర్తి చేశాం. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాలను సంక్రాంతి తర్వాత ప్రారంభించే యోచనలో ఉన్నాం’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

జగన్‌తో మంచి సంబంధాలున్నాయ్!
‘ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉన్నందునే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. గోదావరి, కృష్ణాపై ఉమ్మడి ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టలేదు. ప్రాజెక్ట్‌ను పక్కనెట్టినట్లు సీఎంలు కూడా చెప్పలేదు. చంద్రబాబు హయాంలో కూడా ఏపీతో మంచి సంబంధాలున్నాయి’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.