డాక్టర్ దారుణ హత్య: ప్రధాని మోదీకి కేటీఆర్ రిక్వెస్ట్!

  • IndiaGlitz, [Monday,December 02 2019]

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నిన్న షాద్ నగర్‌ పోలీస్ స్టేషన్ వద్ద.. ఇవాళ చర్లపల్లి జైలు వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. అయితే రోజురోజుకూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఎక్కువవ్వడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు.

మోదీకి కేటీఆర్ రిక్వెస్ట్!
ఇప్పటికే ఈ కేసును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని కేటీఆర్ చెప్పగా.. తాజాగా ఈ విషయమై ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేశారు. చట్టాల్లో మార్పు తీసుకురావాలని కోరుతూ మోదీకి వరుస ట్వీట్లు చేశారు. ‘ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మార్పులు తేవాలి. అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలి. ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదు’ అని ఈ సందర్భంగా మోదీకి రిక్వెస్ట్ పెట్టారు. అంతేకాదు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటన జరిగి ఏడేళ్లయినా నిందితులకు ఉరిశిక్ష పడలేదని.. ఇటీవల తొమ్మిది నెలల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధించాలని దిగువ కోర్టు తీర్పిస్తే, ఆ శిక్షను హైకోర్టు తగ్గిస్తూ జీవితఖైదుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.

హంతకులను ఏం చేద్దాం!
‘హైదరాబాద్‌లో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, హత్య చేశారు. హంతకులు దొరికారు. బాధితురాలికి న్యాయం ఎలా చేద్దాం?. న్యాయం జరగడంలో ఆలస్యమైందంటే న్యాయం జరగనట్టే. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తి దీనిపై ఓ రోజు మొత్తం చర్చించి, ఐపీసీ, సీఆర్పీసీలో సవరణలు తీసుకురావాలి. బాధపడుతున్న, నిస్సహాయంగా వున్న పౌరుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రధానికి కేటీఆర్ ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్ చేశారు.