వైరల్ అవుతున్న మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

  • IndiaGlitz, [Friday,November 25 2022]

సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌కు సాంకేతిక సొబగులు అద్ది, సాహసమే శ్వాసగా సాగిన కృష్ణ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్‌స్టార్ మరణంతో తెలుగు సినిమా తొలి తరం సూపర్‌స్టార్ల శకం ముగిసినట్లయ్యింది. తొలుత ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్ఆర్, ఇటీవల కృష్ణంరాజు కన్నుమూయగా... తాజాగా ఆ తరానికి ప్రతినిధిగా మిగిలిన నటశేఖర కృష్ణ కూడా మనకు దూరమయ్యారు.

ఒకే ఏడాదిలో అన్న, తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ :

ఇక అన్నింటికంటే ముఖ్యంగా వరుసపెట్టి కుటుంబ సభ్యలను కోల్పోతున్న మహేశ్‌ ఇప్పుడు ఒంటరి వారయ్యారు. ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేశ్ బాబు, తర్వాత సెప్టెంబర్‌లో తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ షాక్‌ల నుంచి కోలుకునేలోపే తండ్రి కృష్ణ కూడా మహేశ్‌ను శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు. అయితే తండ్రి మరణం తర్వాత ఆయన ఇంటికే అంకితమయ్యారు. భార్య నమ్రత, తోబుట్టువులు, పిల్లలతో గడుపుతూ ఆ విషాదం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నాన్న.. మీరే నా సూపర్‌స్టార్:

ఈ క్రమంలో గురువారం మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మీ జీవితం , మీ నిష్క్రమణ గొప్పగా జరిగింది. ఇదంతా మీ గొప్పతనమే. ఎవరికీ భయపడకుండా డేరింగ్ అండ్ డాషింగ్‌గా మీ జీవితాన్ని గడిపారు. అదే మీ వ్యక్తిత్వం, మీరే నాకు స్పూర్తి, ధైర్యం. ప్రతి విషయంలోనూ మిమ్మల్నే ఫాలో అయ్యాను.. కానీ ఇప్పుడు అవన్నీ మీతోనే వెళ్లిపోయాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా వున్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు... మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ నాతోనే వుంటాయి. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా... మీరు గర్వపడేలా నడుచుకుంటా. లవ్వు నాన్న.. నా సూపర్‌స్టార్ మీరే’’ అంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు.