నిర్భయ పేరెంట్స్‌కు సెల్యూట్ చేస్తున్నా.. న్యాయం జరిగింది!

  • IndiaGlitz, [Friday,March 20 2020]

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున 4గంటలకు తీహార్‌ జైలులో ఉరిశిక్ష అమలు చేయడం జరిగింది. జైలు నంబర్‌-3లో పవన్‌, ముఖేష్‌, అక్షయ్‌, వినయ్‌కి ఉరి శిక్ష విధించారు. కాగా.. నలుగురు దోషులను ఒకేసారి తలారి పవన్‌ ఉరితీశాడు. ఈ ఘటనపై పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించాడు.

న్యాయమే జరిగింది కానీ..

‘సుదీర్ఘ సమయం పాటు వేచిచూడాల్సి వచ్చినా చివరికి న్యాయం జరిగింది. ఈ ప్రక్రియ న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని నిలబెట్టింది. ఎక్కడా జంకకుండా ఇన్నేళ్లపాటు న్యాయపోరాటం సాగించిన నిర్భయ తల్లిదండ్రులకు, వారి న్యాయవాదులకు సెల్యూట్ చేస్తున్నా. మన న్యాయవ్యవస్థను గౌరవిద్దాం. అయితే మరింత కఠిన చట్టాలు రావాలి. తీవ్ర నేరాల్లో సత్వరమే తీర్పులు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. కాగా.. మహేశ్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.