Mahesh Babu:SSMB28 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ .. మిర్చి యార్డ్‌లో మహేశ్ మాస్ లుక్, అభిమానులకు పూనకాలే

  • IndiaGlitz, [Monday,March 27 2023]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న వీరిద్దరూ దాదాపు పుష్కర కాలం తర్వాత ఒకే సినిమా కోసం పనిచేస్తున్నారు. #SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సూపర్‌స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న #SSMB28ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

మిర్చి యార్డ్‌లో స్టైల్‌గా నడిచొస్తున్న మహేశ్:

పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో ఎవరికో బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో మిగిలిన క్యాస్టింగ్ వివరాలు తెలియాల్సి వుంది.

కృష్ణలాగే మహేశ్‌కు సంక్రాంతి సెంటిమెంట్ :

అయితే తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణలాగే మహేష్ బాబు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో ఆయన నటించిన 'ఒక్కడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరి చిత్రం 'అల వైకుంఠపురములో' సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్:

త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయనున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ కావడంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.