మహేశ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. ఫ్యాన్స్ కన్ఫూజన్

  • IndiaGlitz, [Monday,March 25 2019]

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మహేష్‌కు ఉన్న క్రేజ్‌ను గుర్తించిన ప్రముఖ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు ముందుకొచ్చి.. అచ్చు గుద్దినట్లుగా మహేష్‌ను పోలిన మైనపు విగ్రహాన్ని తయారు చేసింది. సోమవారం నాడు హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏఎంబీ సినిమాస్‌లో మహేశ్ బాబు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబంతో పాటు, భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కాలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు.

అనంతరం ఐదుగురు అభిమానులతో కలిసి మైనపు విగ్రహంతో మహేశ్ సెల్ఫీ దిగారు. కాగా.. మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చంగా అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. విగ్రహాన్ని, మహేశ్‌‌ను పక్కపక్కనే చూసిన అభిమానులు ఇంతకీ ఇద్దరిలో ఎవరు రియల్ అనేది తెలియక కాసింత కన్ఫూజన్ అయ్యారు. ఇదిలా ఉంటే.. విగ్రహ తయారీ ఖర్చు భారీగా అయినట్లుగా తెలుస్తోంది. విగ్రహం మాత్రం సూపర్బ్ కానీ.. మహేశ్ కంటే కాస్త పొడవు అన్నట్లుగా కనిపిస్తోంది.

ఈ సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్‌లో ఉంచుతారు. కాగా రేపు లేదా ఎల్లుండి సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ఈ మైనపు విగ్రహాన్ని తరలిస్తారు. ఇదిలా ఉంటే సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ వారు ఆ దేశంలో కాకుండా బయటి ప్రాంతంలో ఇలా విగ్రహాన్ని ప్రదర్శించడం.. అంతేకాదు ఎవరి విగ్రహాన్ని వారే ఆవిష్కరించడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషమని చెప్పుకోవచ్చు.