తూచ్.. వర్షాలు రాకూడదనలేదు: కొత్త మేయర్ విజయలక్ష్మి

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

రిపోర్టర్: ఈ ఐదేళ్లలో వర్షాలు, వదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమై పోయింది. హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు?

మేయర్: దేవుడిని నేను మొక్కుకుంటాను.. ఈ ఐదేళ్లలో వర్షాలు అవి రాకూడదనేసి..

ఇది ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి.. రిపోర్టర్‌కు మధ్య జరిగిన సంభాషణ. ఇది కాస్తా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. దీంతో విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. వర్షాలపై తన మాటలను వక్రీకరించారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వాపోయారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. దీంతో పాటు షేక్ పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందన్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు.

నగరంలో వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడ్డాయని, అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పడమే తన ఉద్దేశమని విజయలక్ష్మి పేర్కొన్నారు. తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావొద్దన్నదే తన ఉద్దేశం తప్ప, అస్సలు వర్షాలు రావొద్దని కోరుకోవడం కాదన్నారు. అలాగే షేక్ పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందన్న వార్తలపై కూడా విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు.

ఓ ఆదాయ ధ్రువీకరణపత్రం జారీ విషయంలో మేయర్ విజయలక్ష్మికి, షేక్ పేట్ తహసీల్దార్‌కు మధ్య వివాదం తలెత్తింది. అనంతరం ఆయన అనూహ్యంగా బదిలీ అయ్యారు. అయితే తహసీల్దార్ బదిలీకి విజయలక్ష్మియే కారణమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఆమె నేడు క్లారిటీ ఇచ్చారు. తహసీల్దార్ బదిలీ వ్యవహరంలో తన ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. దీనిపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని, తహసీల్దార్ కూడా తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని మీడియాలో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వ్యవహారమన్నారు. దాంట్లో తనకు ఎలాంటి పాత్ర లేదన్నారు.