close
Choose your channels

మెదక్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో సహా 5గురి అరెస్ట్

Thursday, September 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏసీబీ వలకు బుధవారం చిక్కిన భారీ అవినీతి తిమింగళం సహా మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇంకా నగేష్ ఇంట్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు నగేష్‌తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్ హైమద్, జీవన్‌గౌడ్‌లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో భూ డాక్యుమెంట్లు, బినామీ పేర్ల మీద ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో వీఆర్ఓ, వీఆర్ఏ పాత్రలపై కూడా ఆరా తీస్తున్నారు. నేడు అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను వైద్య పరీక్షల అనంతం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామానికి చెందిన రైతు మూర్తికి చెందిన పొలానికి సంబంధించిన ఎన్‌ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. మొదటి విడతగా 19.5 లక్షల రూపాయలను తీసుకున్న నగేష్.. రెండోసారి 20.5 లక్షలను తీసుకున్నారు.

112 ఎకరాల భూమికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఎకరాకు లక్ష చొప్పున అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. రెండు విడతల్లో రూ.40 లక్షలు ఇప్పటికే తీసుకున్న నగేష్.. మిగిలిన 72 ఎకరాల్లో 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్‌గౌడ్‌కి సేల్ అగ్రిమెంట్ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకూ షూరిటీ కోసం బాధితుడి నుంచి నగేష్ 8 ఖాళీ చెక్కులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన కీలక అగ్రిమెంట్లతో పాటు సేల్ డీడ్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారంతా భారీగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.