close
Choose your channels

Chiranjeevi : ఆయనలా ఎవ్వరికీ కాకూడదు, అందుకే బ్లడ్ బ్యాంక్.. అభిమానులే లేకపోతే : చిరంజీవి వ్యాఖ్యలు

Saturday, December 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.

బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సమాజసేవ:

ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్‌లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్‌లను సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్:

తాజాగా చిరంజీవి సామాజిక సేవను ప్రశంసించారు బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ గెరత్ ఒవెన్. శనివారం హైదరాబాద్‌లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి రూ.7 లక్షల విలువైన జీవిత బీమా కార్డులను అందజేశామని.. ఇప్పుడు రెండో విడతగా మరో 1500 మందికి ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చామన్నారు. అభిమానులు లేకపోతే రక్తదాన కార్యక్రమం ఒక జీవనదిలా సాగేది కాదని.. రక్తం దొరక్కుండా ఎవ్వరూ ప్రాణాలు కోల్పోరాదనే ఉద్దేశంతోనే తాను బ్లడ్ బ్యాంక్‌ను నెలకొల్పినట్లు చిరంజీవి పేర్కొన్నారు. రక్తం దొరక్క తన బంధువుల్లో ఒకరు చనిపోయారని ఆయన గుర్తుచేసుకున్నారు.

నా ఫ్యాన్స్ వున్న ప్రతి చోటా బ్లడ్ బ్యాంక్ వున్నట్లే:

అయితే తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్లడ్ బ్యాంకులు ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నకు మెగాస్టార్ స్పందిస్తూ... దీనికి సాంకేతిక కారణాలు వున్నాయని, అన్ని ప్రాంతాల్లో వ్యక్తిగతంగా నిఘా పెట్టడం సాధ్యం కాదని అందుకే తక్కువ సంఖ్యలో బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి.. రక్తదానం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నామని చిరంజీవి వెల్లడించారు. ఎక్కడ ఎవరికి రక్తం అవసరం వున్నా తన అభిమానులు వెళ్లి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారని .. అందువల్ల తన ఫ్యాన్స్ వున్న ప్రతి చోటా బ్లడ్ బ్యాంక్ వున్నట్లేనని ఆయన అన్నారు.

అవార్డుల కోసం ఆరాటపడను:

ఇకపోతే... ఇటీవల గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’’ అవార్డ్‌పై చిరంజీవి స్పందించారు. అవార్డులు, రివార్డుల కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదని, ఆర్టిస్ట్‌గా అందరినీ ఎంటర్‌టైన్ చేయడం మాత్రమే మన పని అని చిరు అన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల రక్తదానం చేశామని మెగాస్టార్ పేర్కొన్నారు. అలాగే ఐ బ్యాంకు వల్ల 9,060 మందికి కంటి చూపు పునరుద్ధరింపబడిందని... 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్‌ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్‌లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని చిరంజీవి గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సమయంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించడంలో ఇవి ఎంతో సహాయపడ్డాయని ఆయన వివరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos