Chiranjeevi:కొన్ని వార్తలకు కలత చెందా : 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకావిష్కరణలో చిరంజీవి వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


భారతీయ తొలి సినీ పత్రిక నుంచి నేటి వరకు పనిచేసిన సినీ జర్నలిస్టుల సమాచారం, సినీ విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’’ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో చిరు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ.. తాను కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో తనకు విడదీయలేని అనుబంధం వుందన్నారు. జర్నలిస్టుల పెన్నుకు వున్న పవర్ అంతా ఇంతా కాదని.. దాని ద్వారా మంచి చెప్పొచ్చు, కానీ కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయని చిరు గుర్తుచేశారు. తాను కూడా కొన్ని వార్తలకు కలత చెందిన సందర్భాలు వున్నాయని.. వాటి ప్రభావం ఇంకా తన జీవితంపై వుందని మెగాస్టార్ వెల్లడించారు.
నా తప్పులను గుడిపూడి ఎత్తిచూపేవారు :
అలాగే నటన , కెరీర్ పరంగా తాను చేసిన తప్పులను గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎత్తిచూపేవారని చిరంజీవి పేర్కొన్నారు. తాను దర్శక , నిర్మాతలతో కూర్చుని మాట్లాడినప్పటికీ.. ఎక్కువగా రచయితలతో సంభాషిస్తూ వుంటాననని మెగాస్టార్ స్పష్టం చేశారు. గతంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్లతో తనకు మంచి అనుబంధం వుందని చిరు తెలిపారు. నేటికీ రచయితలకు, జర్నలిస్టులకు తన హృదయంలో ప్రత్యేక స్థానం వుందని మెగాస్టార్ పేర్కొన్నారు. వినాయకరావు ముందుతరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం తెచ్చారని చిరంజీవి ప్రశంసించారు. ఆయన ఏ పుస్తకం రాసినా లోతుల్లోకి వెళ్లి రాయడం అలవాటని , అలాగే అరుదైన ఫోటోలు కూడా సేకరిస్తూ వుంటారని మెగాస్టార్ కొనియాడారు. వినాయకరావు లాంటి వాళ్లు పుస్తకం రాసే అలవాటు మానుకోకూడదని.. ప్రస్తుత పుస్తకాన్ని తాను కొంటానని ఆయన వెల్లడించారు.
వూళ్లు పట్టుకుని తిరిగా, కుటుంబానికి దూరమయ్యా .. అయినా : వినాయకరావు
అనంతరం వినాయకరావు మాట్లాడుతూ.. ఇది తాను రాసిన 12వ పుస్తకమని టాకీల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు అందరి సమాచారాన్ని ఇందులో అందించానని ఆయన తెలిపారు. బి.కె.ఈశ్వర్, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు వంటి వారు తనకు ఎంతో సాయం చేశారని వినాయకరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పుస్తకాన్ని తీసుకునిరావడానికి నాలుగేళ్లు పట్టిందని.. సమాచార సేకరణ కోసం ఊళ్లు తిరిగానని, కుటుంబానికి కూడా సమయం కేటాయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంత కష్టపడుతున్నా.. తగిన ప్రోత్సాహం లభించకపోవడంతో తాను ఇక నుంచి పుస్తకాలు రాయకూడదని నిర్ణయించుకున్నాను" అని వినాయకరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలలో చిరంజీవి జోక్యం చేసుకుని.. మీ లాంటి వాళ్లు పుస్తకాలు రాయడం ఆపకూడదని, నిరాశ పడవద్దని భరోసా కల్పించారు. తప్పకుండా స్పాన్సర్స్ దొరుకుతారని.. మీ మాటను వెనక్కి తీసుకోవాలి అని చిరంజీవి సహా తోటి జర్నలిస్టులు పట్టుబట్టారు. దీంతో కాస్త మెత్తబడిన వినాయకరావు తన మాటను వెనక్కి తీసుకుని మరో కొత్త పుస్తకం రాస్తానని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments