'రాధా' ను టీడీపీలో చేర్చుకోవద్దంటున్న మంత్రి, యువనేత!
Send us your feedback to audioarticles@vaarta.com
వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అంతేకాదు టీడీపీ నేతలు ఆయనతో చర్చించారు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 24న సీఎం చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకుంటారని వార్తలు వినవచ్చాయి. అయితే ఆయన రాక గురించి తమకు అస్సలు తెలియదని విజయవాడ తెలుగు తమ్ముళ్లే చెబుతుండటం గమనార్హం.
ఇదే జరిగితే పరిస్థితేంటి..!?
వంగవీటి- దేవినేని కుటుంబానికి ఏ రేంజ్లో గొడవలున్నాయో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా గతంలో ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంగవీటి’సినిమాలో ఈ వ్యవహారాలన్నీ కళ్లకు కట్టినట్లుగా చూపించారు కూడా! అయితే ఇప్పుడు రెండు జనరేషన్లు అయిపోయాయ్.. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి దేవినేని అవినేశ్ ఉండగా.. వంగవీటి ఫ్యామిలీ నుంచి రాధాకృష్ణ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు ఇప్పటి వరకూ వీరిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్న సందర్భాలు కూడా తక్కువే.
రానున్న ఎన్నికల్లో తనకు కచ్చితంగా చినబాబు (నారా లోకేశ్) టికెట్ ఇస్తారని.. దేవినేని అభిమానులు, అనుచరులకు, కార్యకర్తలకు మళ్లీ మంచిరోజులొస్తాయని అవినాశ్ సన్నిహితులు చెప్పుకుంటూ ఉంటారు. పైగా ఈ యువనేత లోకేశ్ బ్యాచ్ గనుక టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని దశాబ్దాలుగా తన కుటుంబానికి శత్రువులుగా ఉన్న వంగవీటి కుటుంబం వస్తే పరిస్థితులు అల్లకల్లొల్లంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయం మంత్రి ఆది నారాయణ రెడ్డి-రామ సుబ్బారెడ్డి, కరణం బలరాం-గొట్టిపాటిలతో రుజువైంది.. అంతా ఒకే గూటికి చేరుకోవడంతో గొడవలు ఓ రేంజ్లో ఇప్పటికీ ఉన్నాయి.. భవిష్యత్తులో కూడా ఉంటాయి.
రాధాను రానివ్వొద్దు..!
రాధా టీడీపీలోకి వస్తున్నట్లు వార్త విన్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, తెలుగు యువనేత, దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్ ఇద్దరూ మొదట చినబాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. "ఇదేంటి.. ఇదెక్కడి విడ్డూరం ఆయన్ను మీరెలా చేర్చుకుంటారు..? అసలు మేం పార్టీలో ఉండాలా.. వద్దా..? మా ప్రత్యర్థులను తెచ్చుకుని అందలమెక్కిస్తారా..?" అని గట్టిగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా నాన్నగారే చూసుకుంటారని తన చేతిలో ఏమీ లేదని నారా లోకేశ్ చేతులెత్తెసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై లోకేశ్ను కలిసి అనంతరం చంద్రబాబుతో ఉమా, అవినాశ్ భేటీ అవుతారని సమాచారం. ఆయన్ను పార్టీలోకి రానివ్వొద్దని.. అని సీఎంకు వివరించనున్నారట.
మొత్తానికి చూస్తే.. ఒక వేళ రాధా టీడీపీలోకి పోవాలనుకుంటే కుటుంబ శత్రువులైన దేవినేని కుటుంబంలో ఆదిలోనే బ్రేక్ వేసేందుకు సిద్ధంగా ఉందన్న మాట. మరీ ముఖ్యంగా వంగవీటి రంగా చావుకు టీడీపీకి లింకులున్నాయని చెబుతుంటారు. అందుకే ఆయన ఈ కారణం వల్ల అయినా టీడీపీలోకి వెళ్లేందుకు దాదాపు సహకరించరని అభిమానులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.. ఏంటో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.