పడిపోయిన మోదీ రేటింగ్..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన అద్భుత ప్రసంగాలతో దేశాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్నారు. దీంతో మోదీ ప్రధాని అయితే భారత్ భవిష్యత్ బాగుంటుందని.. అభివృద్ధి చెందిన దేశాల లిస్టులోకి చేరుతుందని దేశ ప్రజానీకం భావించింది. దీంతో బీజేపీని గెలిపించింది. ఆయన జపించిన అభివృద్ధి మంత్రం ఎక్కడ మధ్యలోనే ఆగిపోతుందోనని భావించి రెండోసారి కూడా బీజేపీని గెలిపించి.. మోదీకి ప్రధానిగా కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఆయన ప్రభ మసకబారుతోంది. ఆయన ఆమోదయోగ్యతకు సంబంధించి రేటింగ్‌ మరింత పడిపోయింది. మోదీ రేటింగ్‌ ప్రస్తుతం 63 శాతానికి దిగజారిందని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘మార్నింగ్‌’ వెల్లడించింది.

Also Read: ముంచుకొస్తున్న మరో తుపాను..

ప్రపంచంలోని 13 మంది ముఖ్యనేతల రేటింగ్‌ను ‘మార్నింగ్‌’ సంస్థ ప్రతి వారం ట్రాక్‌ చేస్తుంటుంది. 2019 ఆగస్టు నుంచి మోదీ జనాదరణను ట్రాక్‌ చేస్తూ వస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను అరికట్టలేక ప్రభుత్వ యంత్రాంగం సతమతమవుతున్న నేపథ్యంలోనే మోదీ రేటింగ్‌ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మోదీ ఆమోదయోగ్యత అత్యధికంగా 22 పాయింట్లకు పడిపోయిందని మార్నింగ్‌ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈ స్థాయిలో రేటింగ్ పడిపోవడం ఇదే తొలిసారని ఈ సంస్థ అంచనాలను బట్టి అర్థమవుతోంది. దేశంలోని కొన్ని మహానగరాల్లో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో సైతం ఆస్పత్రుల్లో ప్రాణాలను కాపాడే ఆక్సిజన్‌, పడకల వంటి వైద్యసౌకర్యాలు లేక ప్రజలు మరణించడం వంటివి జరుగుతున్న విషయం తెలిసిందే.

జనాలు ఆసుపత్రుల ఆవరణలో ఎక్కడపడితే అక్కడ ప్రాణాలు కోల్పోతున్నాయి. శ్మశానాల్లో శవాలు పేరుకుపోతున్నాయి. అంతేకాదు.. కొన్ని శ్మశానాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు సైతం కనిపించాయి. ఈ విషయాలన్నింటిపై అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేసింది. ఒక్క ‘మార్నింగ్’ సంస్థే కాదు.. బ్రిటన్‌కు చెందిన యూగవ్‌ (యువర్‌ గవర్నమెంట్‌) అనే పోలింగ్‌ ఏజెన్సీ కూడా ఫిబ్రవరిలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ సమర్థత పట్ల ప్రజల విశ్వాసం పడిపోతూ వస్తోందని తన తాజా సర్వేలో తేల్చింది. గత ఏడాది కరోనా తొలి రోజుల్లో 89 శాతం మంది ప్రజలు.. ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని అభిప్రాయపడగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి 59 శాతం మంది మాత్రమే ప్రభుత్వాన్ని సమర్థించారు. అలాగే హాంకాంగ్‌కు చెందిన ఆసియా టైమ్స్.. మోదీకి ప్రజల ప్రాణాల కంటే తన ప్రతిష్ఠే ముఖ్యంగా మారిందని వ్యాఖ్యానించింది.