close
Choose your channels

ఈ నెల 11న మోదీ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్!?

Wednesday, April 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ నెల 11న మోదీ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్!?

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్-11న కీలక ప్రకటన చేయబోతున్నారా..? ఆ ప్రకటన లాక్‌డౌన్ గురించేనా..? లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయా..? ఈ క్రమంలోనే మోదీ శనివారం నాడు కీలక ప్రకటన చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ మోదీ మనసులో ఏముంది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలపై..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో లాక్‌డౌన్ కూడా దేశ వ్యాప్తంగా నడుస్తోంది. అయితే ఈ లాక్‌డౌన్ ఏప్రిల్-14తో పూర్తి కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈపాటికే లాక్‌డౌన్ ఎత్తేయాల్సి ఉంది. అయితే ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ఘటనతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడం.. ఆ మత ప్రార్థనలకు వెళ్లిన వారి నుంచి మరికొందరికి ఈ వైరస్ సోకడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగానే పడింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

ఏం ప్రకటించబోతున్నారు..!?

ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమాచారం అందజేయడం.. మరోవైపు మోదీ కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు, సలహాలు ఇవ్వడం.. తీసుకోవడం జరుగుతోంది. అయితే.. ఈ నెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలో అసలు లాక్ డౌన్ పొడిగించాలా? వద్దా?.. ఒక వేళ పొడిగిస్తే ఎన్ని రోజులు, కార్యాచరణ ఎలా ఉండాలి..? రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కరోనా ప్రభావం ఉన్న జిల్లాల్లో మాత్రమే లాక్ డౌన్ విధించాలా..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కాన్ఫరెన్స్ అనంతరం మీడియా మీట్ నిర్వహించి మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా.. ఇవాళ ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సలహాలు, సూచనలు తీసుకొని.. తన అభిప్రాయాలను సైతం మోదీ పంచుకున్నారు.

లాక్‌డౌన్‌పై కిషన్ మాటలివీ..

కాగా.. ఈ లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘లాక్‌డౌన్ పరిశీలిస్తున్నాం. లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలి. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. అనవసరపు కారణాలతో ప్రజలు బయటకు వస్తున్నారు. తాజా కూరగాయలే అవసరం లేదు.. పప్పుతో తినొచ్చు. వారం రోజులకు సరిపడా సరకులు దగ్గర పెట్టుకోవాలి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు పరుస్తోంది. దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదు. ఈ రోజే రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.