లెజెండ్రీ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి.. మోడీ, కోవింద్, సచిన్ దిగ్భ్రాంతి!

లెజెండ్రీ అథ్లెట్, ప్లైయింగ్ సిఖ్ గా పేరుగాంచిన మిల్కా సింగ్(91) తుదిశ్వాస విడిచారు. గత నెలరోజులుగా మిల్కా సింగ్ కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి ఆయన్ని గట్టెక్కించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మే 20న కరోనాకు గురైన మిల్కా సింగ్ కొన్ని రోజులు చండీఘర్ లో ఆ తర్వాత మొహాలీలో, మరికొంతకాలం ఇంట్లో చికిత్స పొందారు. ఇటీవల ఆయన ఆక్సిజన్ లెవల్స్ క్షీణించడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీనితో ఆయన మరణించారు. మిల్కా సింగ్ కు పరుగుల వీరుడిగా, అథ్లెట్ గా తిరుగులేని రికార్డ్ ఉంది.

ఇదీ చదవండి: జుమాటో డెలివరీ బాయ్ కోసం విరాళాలు.. హృదయాలు కదిలించేలా.. 

ఆసియాడ్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ లలో మిల్కా సింగ్ ఎన్నో పతాకాలని దేశం తరుపున గెలుచుకున్నారు. 158 ఆసియాడ్ లో 200 మీటర్లు, 400 మీటర్ల రేసులో విజయం సాధించారు. 1962 జకార్తా ఆసియాడ్ లో ఇండియా తరుపున 400 మీటర్లు అలాగే 4x400రిలే రేసులో ఇండియాకు బంగారు పతకాలు తెచ్చిపెట్టారు.

1960 రోమ్ ఒలంపిక్స్ లో మిల్కా సింగ్ తృటిలో ఒలంపిక్ పతాకాన్ని కోల్పోయారు. 400 మీటర్ల ఫైనల్ రేసులో ఆయన 4 వస్థానంలో నిలిచారు. కామన్ వెల్త్ గేమ్స్ లో తొలి బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఆయనే. మిల్కా సింగ్ సాధించిన ఘనతల్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది.

మిల్కా సింగ్ మృతితో క్రీడా ప్రపంచం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులంతా మిల్కా సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే మిల్కా సింగ్ సతీమణి కూడా కరోనా కారణంగా మృతి చెందారు.