close
Choose your channels

ఒక్క ట్వీట్‌తో రూ.1.10 లక్షల కోట్లు కోల్పోయిన మస్క్

Tuesday, February 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒకే ఒక్క ట్వీట్ కొంపముంచింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా పోయేలా చేసింది. షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం. ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయారు. బిట్‌కాయిన్‌లపై ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15 బిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో 1.10 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు.

క్రిప్టోకరెన్సీపై మస్క్‌ గతవారం తన ట్విటర్‌ ఖాతాలో స్పందించారు. నిజానికి ఎప్పుడూ క్రిప్టో కరెన్సీని సపోర్ట్ చేసే మస్క్.. ఈసారి కాస్త రూటు మార్చారు. అదే కొంపముంచింది. ‘చూస్తుంటే బిట్‌కాయిన్‌, ఎథర్‌ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు అన్పిస్తోంది’ అని పోస్ట్‌ చేశారు. సాధారణంగా ఎప్పుడూ బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మాట్లాడే మస్క్‌.. ఇలాంటి అభిప్రాయం చెప్పడంతో ఆ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. ఇక అంతే.. టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది. సోమవారం నాటి అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో టెస్లా షేరు విలువ అమాంతం 8.6శాతం కుంగింది.

ఎలన్ మస్క్, తన ట్వీట్ల ద్వారా నష్టం తెచ్చుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వేల కోట్లను పోగొట్టుకున్నారు. గత ఏడాది కాలంగా 400శాతం పెరిగిన క్రిప్టోకరెన్సీ విలువ మస్క్‌ ట్వీట్‌ తర్వాత పడిపోయింది. 2020 సెప్టెంబరు తర్వాత కంపెనీ షేర్లు ఇంత భారీగా పడిపోవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. తాజా పతనంతో మస్క్‌ నికర సంపద 15.2 బిలియన్‌ డాలర్లు(అంటే భారత కరెన్సీలో రూ. 1.10లక్షల కోట్లు) తగ్గి 183.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. ఈ దెబ్బతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని కూడా మస్క్ కోల్పోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.