నేటి నుంచి చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ ప్రారంభం..

  • IndiaGlitz, [Monday,September 07 2020]

బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్‌ని అందించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దిట్ట. ఒకరకంగా ప్రేక్షకుల నాడి తెలుసుకున్న దర్శకుడు. ఏమాత్రం హంగామా లేకుండా సింపుల్‌గా సాగిపోయే ఈ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడో ‘ఫిదా’ అయిపోయారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల సాయిపల్లవి, నాగచైతన్యలతో ‘లవ్ స్టోరీ’ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాయి పల్లవితో ‘ఫిదా’ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన ఈ ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ఆమెను ఎలా చూపించనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. ‘లవ్ స్టోరీ’ సినిమా కూడా నేటి నుంచి షూటింగ్‌ను ప్రారంభించుకుంటోంది. ఇప్పటికే కొంత మే షూటింగ్‌ను ఈ సినిమా పూర్తి చేసుకుంది. తాజాగా మిగిలిన పార్టును కూడా కంప్లీట్ చేసుకునేందుకు సిద్ధమైంది. నేటి నుంచి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో తాము పాటించబోయే నిబంధనలను చిత్రబృందం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

‘‘కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ‘లవ్ స్టోరీ’ టీం సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేము పాటించబోయే నిబంధనలు.. ‘‘షూటింగ్‌కు 15 మందిని మాత్రమే అనుమతించనున్నాం. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తిరిగి పూర్తయ్యేంత వరకూ ఎవరూ సెట్స్‌ని వదిలి వెళ్లకూడదు. టీం సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలి. స్క్రీనింగ్ నిర్వహించాకే సెట్స్‌లోకి అనుమతి.. అలాగే పిరియాడిక్ టెస్ట్‌ కూడా నిర్వహించబడుతుంది. స్టేట్ గవర్నమెంట్ నిబంధనల మేరకు షూటింగ్‌ను జరపనున్నాం’’  అని చిత్రబృందం ప్రకటనలో తెలిపింది.