close
Choose your channels

మహాత్ముని ఫోటో సబబే.. కానీ మిగిలిన నేతలెక్కడ?: నాగబాబు

Sunday, June 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహాత్ముని ఫోటో సబబే.. కానీ మిగిలిన నేతలెక్కడ?: నాగబాబు

భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహామహులు ఎందరో ఉన్నారని... వారందరినీ ప్రజలు మరచిపోతున్నారని ముఖ్యంగా పిల్లలకు తెలియటం లేదని మెగా బ్రదర్ నాగబాబు మరోసారి వాపోయారు. కరెన్సీ నోట్లపై నేతల ఫోటోల విషయంలో ఇటీవల ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తరువాత ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మరోసారి తన ఉద్దేశాన్ని ప్రజలకు వివరించే ఉద్దేశం చేశారు. కరెన్సీ నోట్లు ప్రతి ఒక్కరూ వాడతారు కాబట్టి వాటిపై వివిధ రంగాల్లో దేశానికి వన్నె తెచ్చి మహనీయుల ఫోటోలుంటే పిల్లలు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారనేది ఆయన వాదన. వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని చెబుతూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘భారతదేశానికి వన్నె తెచ్చి మహామహుల ఫోటోలు మన ఇండియన్ కరెన్సీపై ఎందుకు లేవనేది నాలో చిన్నప్పటి నుంచి తలెత్తుతున్న ప్రశ్న. మన కరెన్సీపై జాతిపిత మహాత్ముని ఫోటో పెట్టడం సబబే. జవహర్‌లాల్ నెహ్రూ కాయిన్ ఉంటుంది కానీ లాల్ బహదూర్ శాస్త్రి కాయిన్ ఇప్పటి వరకూ చూడలేదు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఫోటోతో కాయిన్ లేదు. ప్రతి ఒక్కరికీ గాంధీ గురించి తెలుసు. కానీ ఎంత మందికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, భారతీయార్ తదితరుల గురించి తెలుసు? భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వీళ్ల విజువల్ స్లోగా కనుమరుగైపోతోంది. ప్రతి ఒక్క రంగంలోనూ ప్రసిద్ధి చెందిన గొప్ప వ్యక్తులున్నారు.

అంబేద్కర్.. భారత రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు.. ఆయనను కొంతమందికే నేతగా కుదించేశారు. వీళ్లందరి ఫోటోలు కరెన్సీ నోట్లపై ఉంటే వాళ్ల గురించి, వాళ్ల విలువ గురించి మనకు తెలుస్తుంది. నేతాజీ ఒక గ్రేటెస్ట్ వారియర్.. ఆయన ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే పిల్లలు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పాఠ్యాంశాల్లో సైతం వారి గురించి ఏదో పేరుకే ఉంటోంది.. పోను పోను అది కూడా తగ్గుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాడే కరెన్సీ నోటుపై వారి చిత్రాలుంటే బాగుంటుంది. అమెరికన్ డాలర్స్ చూశాను. వాటిపై చాలా మంది చిత్రాలుంటాయి. ప్రతి దేశంలోనూ వారి దేశానికి ప్రసిద్ధులైన వారి ఫోటోలుంటాయి. దేశాన్ని తీర్చిదిద్దిన మహానుభావుల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించాలని అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది’’ అని నాగబాబు పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.