Nandamuri Tarak Ratna:విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్పైనే చికిత్స, హెల్త్ బులెటిన్లో వైద్యులు


Send us your feedback to audioarticles@vaarta.com


గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే వున్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా తారకరత్నకు ఎక్మోపై చికిత్స అందించడం లేదని నారాయణ హృదయాలయ తెలిపింది.
తారకరత్న కోలుకుంటున్నారన్న నందమూరి రామకృష్ణ :
అంతకుముందు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న వెంటిలేటర్పై వున్నప్పటికీ.. తనంతట తానుగా శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని రామకృష్ణ పేర్కొన్నారు. ఇదే సమయంలో న్యూరో అనేది రాత్రికి రాత్రే రికవరీ అయ్యేది కాదన్న ఆయన.. దానికి కాస్త సమయం పడుతుందని చెప్పారు. తారకరత్నకు ఎక్మో పెట్టినట్లుగా వస్తున్న వార్తలను రామకృష్ణ కొట్టిపారేశారు. ప్రస్తుతం తారకరత్న అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని ఆయన తెలిపారు. కార్డియాలజిస్టులతో పాటు న్యూరాలజిస్టులు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని రామకృష్ణ వెల్లడించారు. త్వరలోనే తారకరత్న కోలుకుని మామూలు మనిషిగా తిరిగి వస్తారని ఆయన చెప్పారు.
తారకరత్న ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న పది మంది వైద్యులు :
మరోవైపు ఆసుపత్రి వద్దకు నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ అభిమానులు, సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై సమీక్షిస్తున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు శరీర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడిందని ఆయన మీడియాకు వివరించారు. ప్రముఖ న్యూరోసర్జన్ గిరీష్ కులకర్ణి ఆధ్వర్యంలో ఇద్దరు వైద్యులతో పాటు నారాయణ హృదయాలకు చెందిన మొత్తం పది మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.