ఆర్కేకు-లోకేష్ కరచాలనం.. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయిస్తాం!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. అమరావతిలోని ఇంటి నుంచి టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శపథం చేశారు. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన మీడియా చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా అమరావతిలోని కృష్ణా కరకట్ట పక్కనే ఉన్న చంద్రబాబు ఇంటిపై చర్చనడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరకట్ట పక్కనే ఉన్న ప్రజా వేదికను టీడీపీకి కేటాయించాలంటూ చంద్రబాబు అడగ్గా.. మరోవైపు ఉన్న ఇళ్లు అక్రమ నిర్మాణమని దాన్ని కూడా ఖాళీ చేయిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆర్కే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్కే మాటల్లోనే...
"రాజధాని పనులు ఆగిన విషయం తెలీదు. పనులు ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాలి. కాంట్రాక్టర్లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఎక్సెస్ టెండర్లపై అప్పుడే అంత ఆందోళన ఎందుకు.!? కరకట్ట మీద అక్రమ నిర్మాణాలపై కోర్టులో పోరాటం కొనసాగుతుంది. మాజీ సీఎం చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణంలోనే..! చంద్రబాబును ఆ నివాసం నుంచి కాళీ చేయిస్తాం. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధాని గురించి ఎలా మాట్లాడతారు..? మా అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. మరి బాబు ఎక్కడ కట్టుకున్నాడు!?" అని చంద్రబాబుపై ఆర్కే ప్రశ్నల వర్షం కురిపించారు.
పదవిపై పెదవి విప్పిన ఆర్కే..
మంత్రి పదవి దక్కని ఆళ్ల రామకృష్ణారెడ్డికి కచ్చితంగా నామినేటెడ్ పదవి ఇస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. అంతేకాదు కొందరేమో అగ్రికల్చర్కు సంబంధించి కీలక పదవి ఇస్తారని.. మరికొందరమే సీఆర్డీఏ (CRDA) చైర్మన్ పదవి ఇస్తారని పుకార్లు వచ్చాయి. ఈ వ్యవహారంపై తాజాగా ఆళ్ల స్పందిస్తూ.. సీఆర్డీఏకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారని.. ఆ పోస్ట్ తనకు ఇస్తున్నారన్న విషయం తెలియదని స్పష్టం చేశారు. కాగా వ్యవసాయం సంబంధించినది ఏదైనా లేదా సీఆర్డీఏ అయినా ఆర్కే కచ్చితంగా న్యాయం చేస్తారని.. వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే జగన్ మనసులో ఏముందో..? ఇంతకీ ఆర్కేకు నామినేటెడ్ పదవి ఇస్తారా..? లేకుంటే రెండేళ్ల తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.
ఆర్కేకు కరచాలనం..
ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేకు.. లోకేష్ కరచాలనం చేసి కంగ్రాట్స్ సార్ అని తెలిపారు. అయితే ఇందుకు ప్రతిస్పందించిన ఆర్కే.. ధన్యవాదాలు అంటూ నవ్వుకున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ టీడీపీ తరఫున.. వైసీపీ తరఫున ఆర్కే తలపడి.. ఆళ్ల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇలా ప్రత్యర్థులు ఇద్దరూ పలకరించుకోవడం ఇదే మొదటసారి కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన లోకేష్.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.