20 ఏళ్ల అపురూప జ్ఞాపకాల సాక్ష్యం 'నీ కోసం'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా పుట్టుక మొదలు ఎన్నో సినిమాలు వస్తున్నాయి...పోతున్నాయి. అయితే ఈ నిరంతర సినీ మజిలీలో కొన్ని సినిమాలు మాత్రం మైలురాళ్ళగా నిలిచిపోతుంటాయి. ఆలా అపురూప జ్ఞాపకాల దొంతర్లలో మిగిలిపోయిన అవార్డుల సినిమా నీ కోసం. రవితేజ, మహేశ్వరి నాయకా నాయికలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వల్లభనేని జనార్దన్ సమర్పణలో ఘంటా శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై...మంగళవారానికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1999 డిసెంబర్ 3న విడుదలైన ఈ ఫీల్ గుడ్ చిత్రానికి అప్పట్లో అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు లభించాయి.
1999వ సంవత్సరానికి 5 నంది అవార్డులను అందుకుని అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిత్రం అప్పట్లో రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందుకుంది. రవితేజకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు హీరోగా నిలదొక్కునే చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతే కాదు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా రవితేజకు లభించింది. ఇక మహేశ్వరికి ఉత్తమ నటిగా నంది అవార్డు, శ్రీను వైట్లకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు, ఉత్తమ పరిచయ దర్శకుడిగా శ్రీను వైట్ల మరో నంది అవార్డును అందుకున్నారు. ఉత్తమాభిరుచే ఇలాంటి చిత్రం రూపొందానికి కారణమని అంటారు నిర్మాత ఘంటా శ్రీనివాసరావు. చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ గా సుదీర్ఘ అనుభవం గడించుకున్న ఆయన మొదటిసారి నిర్మాతగా మారి తీసిన చిత్రమిది.
ఈ చిత్రం 20 ఏళ్ల మజిలీ సందర్బంగా నాటి ముచ్చట్లను నిర్మాత ఘంటా శ్రీనివాసరావు పంచుకుంటూ.... ప్రఖ్యాత నిర్మాత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. అప్పట్లో ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆయనకు ఎలాగైనా చూపించాలని అనుకున్నాను. ఆయనను సంప్రదించి చిత్రం చూడమని కోరం. దాంతో ఆయన చిత్రాన్ని చూడటంతో పాటు చిత్రాన్ని తామే కొనుగోలు చేసి...వారి మయూరి సంస్థ ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు తెచ్చి పెట్టడమే కాదు కెరీర్ ను సైతం మలుపు తిప్పింది. రాంప్రసాద్ కెమెరామెన్ గా మరింత బిజీ అయ్యారు. ఆర్.పి పట్నాయక్ ఇది తొలి చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం ఓ పాట కూడా కంపోజ్ చేసారు. ఇలా ఆ చిత్రం గురించి ఏది గుర్తు చేసుకున్నా మధురాతి మధురమే అంటారు ఘంటా శ్రీనివాసరావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.