close
Choose your channels

పీఎం నుంచి సీఎం వరకూ ఒక్కరూ ముందుకు రారే.. వీళ్లవేనా ప్రాణాలు?

Saturday, January 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏడాది కాలంగా ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారికి మందు వచ్చేసింది. నేటి నుంచి దేశ వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్, 50 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ను అందిస్తామని.. ఆ తరువాత ప్రజలందరికీ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే 18 ఏళ్ల పైబడిన వారు, గర్భిణులు, అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవద్దని వైద్యులు కచ్చితంగా సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమమేగానీ ప్రజా ప్రతినిధులపై మాత్రం తీవ్ర స్థాయిలోనే విమర్శలు వినవస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

కోవిడ్ టీకాపై ఎన్నో అపోహలున్నాయి. ఈ అపోహలను పోగొట్టేందుకు వైద్యులు తమ వంతు కృషి తాము చేస్తున్నారు. అయితే ముందుగా ఈ టీకాను వేయించుకుని ప్రజలకున్న అపోహలను తొలగించాల్సిన ప్రజా ప్రతినిధులు మాత్రం వ్యాక్సిన్‌కు దూరంగానే ఉన్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంతో అదరగొట్టేశారు. కానీ తాను వ్యాక్సిన్ తీసుకోబోనని ముందే ప్రకటించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇతర రాష్ట్రాల్లోనూ సీఎంల నుంచి ప్రజా ప్రతినిధులెవరూ వ్యాక్సిన్ వేయించుకున్న పాపాన పోలేదు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేసి సైలెంట్ అయిపోయారు. అదేమంటే.. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే.. ఆ తరువాతే ప్రజా ప్రతినిధులకైనా.. మరొకరికైనా అంటూ కబుర్లు చెబుతున్నారు.

దీనిపై నెటిజన్లు.. ప్రజానీకం దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ కబుర్లన్నీ ఎందుకు? ‘మీరు బతికి బాగుంటే మేము వేయించుకుంటామని డైరెక్టుగా చెప్పొచ్చుగా’ అంటూ మండిపడుతున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రధాని నుంచి సీఎంలు.. ఎమ్మెల్యేల వరకూ ఏ ఒక్కరూ టీకా వేయించుకునేందుకు ముందుకు రాకపోవడమేంటని మండి పడుతున్నారు. ఓ వైపు ఎయిమ్స్ డైరెక్టర్ టీకా తీసుకుంటే.. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాత్రం చూస్తూ ఉండిపోయారు. ప్రతిపక్షాల సంగతి ఎలా ఉన్నా.. అధికార పక్షంలో ఉన్న నేతలైనా టీకా వేయించుకుంటే ప్రజలకు ఎంతో కొంత నమ్మకం కలుగుతుంది కానీ తమ ప్రాణాలు విలువైనవి.. ఇతరుల ప్రాణాలు మాత్రం తృణప్రాయంగా చూడటాన్ని జనం జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నో దేశాల్లో ఆ దేశ అధ్యక్షులే తొలి టీకాను వేయించుకుని ప్రజలకు టీకాపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించారు. కానీ భారత్ దేశంలో మాత్రం దీనికి రివర్స్. ఒక్కరంటే ఒక్కరు కూడా టీకా వేయించుకునేందుకు ముందుకు రాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.