కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలైంది.. టీపీసీసీ అధ్యక్షుడిగా...

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

ఒకప్పుడు తెలంగాణను ఏలిన పార్టీ.. ఇప్పుడు పూర్తిగా వరుస ఎదురు దెబ్బలతో అల్లాడుతోంది. వరుస వైఫల్యాలు ఈ పార్టీ నేతల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి. నాయకత్వ లేమి కూడా ఈ పార్టీకి మరో అవరోధంగా మారుతోంది. కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణలో ఈ పార్టీ ఆధిపత్యాన్ని కనబరిచింది. ఈ పార్టీకి చెందిన తెలంగాణ నాయకుడు ప్రధాని మంత్రిగా ఎన్నికవడం విశేషం. సౌత్ ఇండియా నుంచి చూసినప్పటికీ ఆయనొక్కడే ప్రధాని కావడం గమనార్హం. తెలంగాణలో అంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దారుణ స్థితిలోకి చేరుకోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా తెలంగాణపై తమ పట్టును కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సిన తరుణం వచ్చింది. కాగా.. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమట్ రెడ్డి వెంకట్ రెడ్డి కానీ శ్రీధర్ బాబుని కానీ ఎంపిక చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. జాతీయ కాంగ్రెస్ కమిటిలోకి సీనియర్ నేతలు జానారెడ్డి, హనుమంతరావులను తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్‌గా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కను నియమించనుంది. అయితే జానారెడ్డి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లు సమాచారం. ఈ నెల 7న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.