వైఎస్ జగన్ను కలిసిన నిఖిల్.. రాజకీయాల్లో చర్చ!
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కలిశారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టడం పట్ల నిఖిల్ అభినందనలు తెలిపారు.
కాగా.. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో మాండ్యా నుంచి పోటీచేసిన నిఖిల్.. సుమలత చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సుమలత కనివినీ ఎరుగని రీతిలో 703,660 ఓట్లు దక్కించుకుని అనగా.. 51% శాతంతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగింటి ఆడపడుచు సుమలతను ఓడించి నిఖిల్ను గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాండ్యాలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబును కలవకుండా.. వైఎస్ జగన్ను నిఖిల్ కలవడంతో అటు కర్ణాటక.. ఇటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.