కరోనా విషయంలో రూల్స్ పాటించండి..: నిశ్శబ్దం టీమ్

  • IndiaGlitz, [Wednesday,March 18 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 271 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్‌కూ పాకడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలకూ కోవిడ్-19 వైరస్ వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చనిపోవడంతో.. ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు జంకుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ ఈ కరోనా విస్తరిస్తుండటం.. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మొదలుకుని.. థియేటర్స్ వరకూ అన్నీ బంద్ చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.

ఇప్పటికే సెలబ్రిటీలు..

అయితే.. దీనిపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు జనాల్లోకి వెళ్లలేదు. ఏ సమాచారమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే దానికి బలమైన మాధ్యమం కూడా ఉండాలన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలను సినీతారలు చెబితే ప్రజల్లోకి త్వరగా వెళ్తాయి. అందుకే ఇప్పటికే టాలీవుడ్ నటీనటులు తమ వంతుగా అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. తాజాగా.. ‘నిశ్శబ్దం’ మూవీ టీమ్ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

వీడియోలో ఏముంది..!?

అనుష్క, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు హేమంత్ మధుకర్ కలిసి 01:33 నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.‘ప్రభుత్వం చెప్పిన రూల్స్ కచ్చితంగా పాటించండి. రోజుకి సగటున 8 సార్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తప్పని సరిగా శానిటైజర్ వాడాలి. కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి. కనీస జాగ్రత్తలు పాటించడం మనందరి బాధ్యత’ అని నిశ్శబ్దం టీమ్ చెప్పింది.

విడుదల వాయిదా!

కాగా.. టాలీవుడ్ జేజెమ్మ అనుష్క శెట్టి దాదాపు రెండేళ్ల త‌ర్వాత ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, కోన‌వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కానీ.. క‌రోనా వైర‌స్‌ ప్రభావంతో సినిమా విడుద‌ల‌పై అనుమానాలు నెల‌కొన్నాయి.