ధైర్యంగా పని మొదలుపెట్టిన నితిన్!

  • IndiaGlitz, [Monday,June 14 2021]

నితిన్ చాలా ఇష్టపడి చేస్తున్న చిత్రం మాస్ట్రో. నితిన్ కెరీర్ లో ఇది 30వ చిత్రం. హిందీలో ఘన విజయం సాధించిన అంధాదున్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇప్పటికే విడుదలై టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అంధాదున్ కథ తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అవుతుందని భావించిన నితిన్.. రీమేక్ హక్కులు తీసుకుని నటిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రియమణి బ్లాక్ ఆంటీ అని హేళనకు గురైన వేళ..

యంగ్ బ్యూటీ నభా నటేష్ తొలిసారి నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అన్ని చిత్రాలతో పాటు మాస్ట్రో షూటింగ్ కూడా ఆగిపోయింది. గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు ఇండియాలో కాస్త తగ్గుముఖం పట్టాయి.

దీనితో టాలీవుడ్ లో ఆశలు చిగురిస్తున్నాయి. హీరో నితిన్ తొలి అడుగు వేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ భయాన్ని పక్కన పెట్టి షూటింగ్ తిరిగి ప్రారంభించడం కోసం నితిన్ ధైర్యంగా ముందడుగు వేశారు. మాస్ట్రో మిగిలిన షూటింగ్ పూర్తి చేయడం కోసం చివరి షెడ్యూల్ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ ప్రారంభించిన తొలి చిత్రంగా మాస్ట్రో నిలిచింది.

భీష్మకి సంగీతం అందించిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. శ్రేష్ఠ్ మూవీస్‌ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జె. యువరాజ్ ఈ చిత్రానికి సినిమాట్రోగ్రాఫర్.

హిందీలో అంధాదున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.