ఈ ఒక్క పనిచేస్తే.. చంద్రబాబుకు ఎవ్వరూ ఓటెయ్యరు!

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండని కార్యకర్తలకు, నేతలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగింపు రోజున భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరగడమే కాకుండా.. కార్యకర్తలు, పార్టీ నేతలకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.ఈ నవరత్నాలను జనాల్లోకి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. జనం ఓటు వేయరన్నారు.

ఆరు నెలలు కలిసి ఉంటే.. వారు వీరు.. వీరు వారవుతారని జగన్ సెటైరికల్‌‌గా మాట్లాడారు. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని జగన్ చెప్పారు. ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉందని.. ఇప్పుడు తాను చేసే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదని.. ఎల్లోమీడియాతో కూడా అని మీరంతా తోడుగా ఉంటే కచ్చితంగా జయిస్తానని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ చెబుతున్నట్లుగా నవరత్నాలు అనే ఒక్క పనిని పార్టీ శ్రేణులు ఎంత వరకు జనాల్లోకి తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.

చిత్తవుతాయా.. చిత్తు చేస్తాయా..!?

జగన్ చెబుతున్నట్లుగా ఈ నవరత్నాలు జనాల్లోకి తీసుకెళ్తే అవి ఏ మాత్రం పనిచేస్తాయ్..? జగన్‌కు ఏ మేరకు ఓట్లు సంపాదించిపెడ్తాయ్..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో అందరికంటే నేనే సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుల ముందు ఈ నవరత్నాలు చిత్తవుతాయా..? బాబు ఎత్తులను చిత్తు చేస్తాయో..? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే మరి.