ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్టీఆర్.. చుట్టూ వాలిపోయిన ఉద్యోగులు!

  • IndiaGlitz, [Saturday,July 31 2021]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపిస్తే చాలు.. అభిమానులు ఎగబడుతుంటారు. తారక్ క్రేజ్ అలాంటిది. ఎంత పెద్ద స్టార్స్ అయినా తమ పనుల కోసం కొన్ని సార్లు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఎన్టీఆర్ కూడా శుక్రవారం ప్రభుత్వ కార్యాలయంలో తళుక్కున మెరిశాడు. తన ప్రాజెక్ట్స్ తో బిజీగా గడిపే తారక్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన గోపాలపురం గ్రామ పరిధిలో ఎన్టీఆర్ ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ రాకతో ఉద్యోగులంతా అతడి చుట్టూ ఫోటోల కోసం వాలిపోయారు. అయితే ఎన్టీఆర్ ఎవ్వరినీ నిరాశపరచలేదు. కార్యాలయంలోని ఉద్యోగులందరితో ఫోటోలు దిగాడు. భూమికి సంబంధించిన వ్యవహారం ముగిసాక తిరిగిపయనమయ్యాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తారక్స్వాతంత్ర సమరయోధుడు, నిజాంపై పోరాడిన కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు రాంచరణ్ అల్లూరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కళ్ళు చెదిరే యాక్టన్ ఎపిసోడ్స్ తో వీరిద్దరి పాత్రలు సూపర్ హీరోలను తలపించే విధంగా ఉండబోతున్నట్లు టాక్. ఇక ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు షోకి తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.