మరోసారి సమన్లు

  • IndiaGlitz, [Wednesday,June 28 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా 'శ్రీమంతుడు'. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. మ‌న‌కు ఎంతో చేసిన మ‌న పుట్టిన ఊరుకి మ‌నం తిరి ఏదో చేయాల‌నే కాన్సెప్ట్‌తో శ్రీమంతుడు తెర‌కెక్కింది. సినిమాలో గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డం అనేది మెయిన్‌ పాయింట్‌. అప్ప‌ట్లో న‌రేంద్ర‌మోడీ కూడా ఎన్నారైలు వారి గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని చెప్పాడు. ఈ రెండు పాయింట్స్ క‌ల‌వ‌డం యాదృచ్చికం అయినా సినిమాకు ఇది కూడా ప్ల‌స్ అయ్యింది. సినిమా విడుద‌ల త‌ర్వాత చాలా మంది సినీ ప్ర‌ముఖులు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నారు.
ఇవ‌న్నీ ప‌క్కన పెడితే శ్రీమంతుడు సినిమా త‌ను స్వాతి మేగ‌జైన్‌లో రాసిన చ‌చ్చేంత ప్రేమ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కింద‌ని కాపీ రైట్ యాక్ట్ క్రింద రైట‌ర్ శ‌ర‌త్ చంద్ర నాంప‌ల్లి కోర్టులో కేసు వేశాడు. కేసు ప‌రిశీలిస్తు్న్న న్యాయ‌స్థానం శ్రీమంతుడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, మహేష్ బాబుల‌ను కోర్టుకు హాజ‌రు కావాల్సిందిగా కోరింది. కానీ మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు హాజ‌రు కాలేదు. త‌న త‌ర‌పున వేరే వ్య‌క్తి కోర్టుకు హాజ‌ర‌వుతార‌ని విన్న‌వించుకున్నాడు. కానీ కోర్టు మ‌హేష్ విన్న‌పాన్ని తిర‌స్క‌రించింది. ఆగ‌స్ట్ 7న జ‌ర‌గ‌నున్న విచార‌ణ‌కు మ‌హేష్ హాజ‌రు కావాల్సిందేన‌ని గ‌ట్టిగా చెప్పింది. ఒక‌వేళ మ‌హేష్ కోర్టుకు హాజ‌రు కాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.