'ప‌ద్మావ‌తి' వాయిదా..?

  • IndiaGlitz, [Sunday,November 19 2017]

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజ‌స్థాన్ మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌గాథ‌ను సంజ‌య‌ల్ లీలా బ‌న్సాలీ అదే పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ పాత్ర‌లో దీపికా ప‌దుకొనే న‌టిస్తుంటే..చిత్తోర్‌గఢ్‌ రాజు రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేయాల‌ని యూనిట్ నిర్ణ‌యించుకుంది. అయితే ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గానే వివాదాల బాట ప‌ట్టింది. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని ప‌లువురు రాజ‌పుత్ సంఘాలు యూనిట్‌పై దాడి చేశాయి. ఎలాగెలాగో సినిమాను పూర్తి చేశారు. సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి.

రాజ‌పుత్ర సంఘాల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు కూడా సినిమాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. సినిమా విడుద‌ల‌కు ముందే త‌మ‌కు చూపించాల‌ని ప‌లు సంఘాలు డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టాయి. దీనిపై సెన్సార్ బోర్డ్ చైర్మ‌న్ ప్రసూన్ జోషి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా, సెన్సార్ ద‌ర‌ఖాస్తు అసంపూర్తిగా ఉంద‌ని సినిమాను వెన‌క్కి పంపింది.

దీంతో నిర్మాణ సంస్థ వ‌యోకామ్ 18 సినిమా విడుద‌లను వాయిదా వేయాల‌నుకుంటున్న‌ట్లు త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని తెలియ‌జేస్తామ‌ని సంస్థ తెలిపారు. జ‌న‌వ‌రిలో ప‌ద్మావ‌తి విడుద‌ల ఉండొచ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.