దయచేసి నటించడం ఆపోద్దమ్మా రాములమ్మా..!
- IndiaGlitz, [Tuesday,October 15 2019]
ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఈ సీనియర్ నటి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా హీరో, హీరోయిన్తో పాటు కీలక పాత్రధారి అయిన విజయశాంతిపై కూడా దాదాపు అన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
విజయశాంతి గురించి.. టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పరుచూరి తన అభిప్రాయాలను యూ ట్యూబ్ చానెల్ వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా రాములమ్మ గురించి చాలా వివరంగా చెప్పుకొచ్చారు.
దయచేసి ఆపొద్దమ్మా..!‘
అసలు విజయశాంతి సినిమాల్లోకి ఎందుకు రీ ఎంట్రీ ఇవ్వాలనుకుందో తెలియదు కానీ.. ఆమె ఇలా నటనను కొనసాగించాలి. మళ్లీ సినిమాల్లో నటించడం ఎందుకు మొదలుపెట్టావో తెలియదు కానీ.. ఇక నటించడం దయచేసి ఆపొద్దమ్మా. మిమ్మల్ని సినిమా సెట్లో చూడగానే ఒక అద్భుతమైన నటిని ఇండస్ట్రీ దూరం చేసుకుంది. ఇప్పుడున్న రాజకీయాల గురించి మీకు తెలుసు. అందుకే మీరు మరిన్ని చిత్రాల్లో నటించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని పరుచూరి బ్రదర్ చెప్పుకొచ్చారు. అయితే ఈయన సలహాలను రాములక్క ఏ మాత్రం పాటిస్తుందో వేచి చూడాలి మరి.