దయనీయ స్థితిలో పావలా శ్యామల..

  • IndiaGlitz, [Tuesday,May 18 2021]

కేరెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటి పాత్రల్లో నటిస్తూ సినీ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పావలా శ్యామల పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఎస్‌ఆర్ నగర్‌లోని బీకే గూడలోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. ప్రస్తుతం పావలా శ్యామల తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆమె కూతురి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కాగా.. పావలా శ్యామల అనారోగ్యం కారణంగా నటనకు దూరమవడంతో మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. గతంలో పావలా శ్యామల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఆమెకు నెలకు రూ.10 వేలు పెన్షన్‌ను మంజూరు చేసింది. అయితే ఇటీవల అది కూడా సరిగా అందడం లేదని ఆమె వాపోతున్నారు.

పావలా శ్యామల కష్టాల గురించి తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి రూ.10వేలు సాయం చేశారు. శ్యామల పరిస్థితిని కరాటే కళ్యాణి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి వద్ద పావలా శ్యామల తన గోడును వెళ్లబోసుకున్నారు. చాలాకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... కనీసం అద్దె కూడా కట్టే పరిస్థితి లేదని వెల్లడించారు. ఇటీవలి కాలంలో పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తోందని ఆమె వెల్లడించారు. తనకు, తన కూతురికి మందులకే నెలకు రూ.10 వేలు ఖర్చవుతోందని.. తన జీవనం గడిచేందుకు తక్కువలో తక్కువ నెలకు రూ.15 వేలైనా అవసరమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అవార్డులు అమ్మి ఇల్లు గడుపుకుంటున్నామని పావలా శ్యామల తెలిపారు.

పావలా శ్యామల కూతురు టీబీ వ్యాధి బారిన పడి కోలుకుంటున్న సమయంలోనే ఓ కాలికి గాయం కావడంతో నా కూతురు 18 నెలలుగా మంచానికే పరిమితమయింది. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా తన కూతురు బాగోగులు చూసుకుంటూ పావలా శ్యామల దయనీయమైన జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ అవార్డులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పవన్‌ కల్యాణ్‌ ఆమె దుస్థితిని తెలుసుకుని రూ.లక్ష సాయం అందించారు. పేద, వృద్ధ కళాకారులకు అండగా ఉంటామనే ‘మా’ అసోసియేషన్‌ శ్యామల పరిస్థితి తెలుసుకుని స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.