close
Choose your channels

రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి: పవన్

Saturday, August 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి: పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా.. నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. ఇది రాజధాని కోసం భూములిచ్చిన 28 వేల రైతు కుటుంబాల సమస్య కాదని.. యావత్తు రాష్ట్ర ప్రజల సమస్యని పేర్కొన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంత రైతులు వచ్చారు. పవన్ కళ్యాణ్‌తో సమావేశమై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తం ఇవ్వలేదనీ, రాజధాని గురించి మంత్రులు, అధికార పక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు.

అవకతవకలు ఉంటే సరిదిద్దాలి!

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం అమలు చేయాలి. దానిలో ఏమైనా అవకతవకలు ఉంటే సరిదిద్దాలి తప్ప మొత్తానికి రాజధానినే మార్చేస్తాం అంటే ప్రభుత్వం, ప్రభుత్వ విధివిధానాలపై ప్రజలకు నమ్మకం పోతుంది. కొందరు వ్యక్తులకు అధికారం ఇచ్చాక వారు తీసుకున్న నిర్ణయాలకు మనం బందీలం. రాష్ట్రం విడగొట్టినా, డీమానిటైజేషన్ అంటూ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకొని తీరాల్సి వచ్చింది. వేరే దారి లేదు. అలాగే గత ప్రభుత్వం రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు మంచో చెడో దానికి అందరం కట్టుబడి ఉండాలి" అని పవన్ చెప్పుకొచ్చారు.

అభివృద్ధి కోసం వెచ్చించింది ప్రజల డబ్బే

"మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులను గందరగోళానికి గురి చేసే ప్రకటనలు చేయకూడదు. అలా చేస్తే రాష్ట్రానికే కాదు దేశం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. ఒకసారి రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేశారు. మళ్లీ ఇప్పుడు రాజధాని అమరావతి కాదు ఇంకొక చోట అంటే మన ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజధాని అమరావతిలో ఏం అభివృద్ధి జరిగిందో నాతో సహా రాష్ట్రంలో చాలామందికి తెలియదు. అక్కడ ఏం చేశారో తెలియాలి. ఇప్పుడు రాజధాని మారిస్తే అభివృద్ధి కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులు ఏమవ్వాలి. అభివృద్ధి కోసం వెచ్చించిన డబ్బు ప్రజల సొమ్ము.... మంత్రులు, ముఖ్యమంత్రుల డబ్బు కాదు. ఈ నెల 30, 31 తేదీల్లో పార్టీ నాయకులతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించి ఎంత అభివృద్ధి జరిగిందో స్వయంగా చూసి ప్రజలకు తెలియజేస్తాం. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పోరాటానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. మూడు పంటలు పండే భూములను రైతులు ప్రభుత్వానికి ఇచ్చి త్యాగాలు చేశారు. వారి త్యాగాలను వృథా కానివ్వం మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు చేస్తున్న ప్రకటనలు మా ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి" అని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. మరి పవన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.