జగన్, మోదీకి పవన్ శుభాకాంక్షలు.. మాట నిలబెట్టుకోండి!
- IndiaGlitz, [Friday,May 24 2019]
ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఊహించని పరాభావం ఎదురైంది. రెండు స్థానాల్లో పవన్ పోటీ చేసినప్పటికీ ఒక్కస్థానంలో గెలవకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఆయన పార్టీకి చెందిన ఒక్కరంటే ఒక్కరికీ అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం దక్కలేదు. ఆఖరికి ఆయన సోదరుడు, నటుడు ఎంపీగా పోటీచేసిన నాగబాబు ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమిపై పవన్ కల్యాణ్ ప్రెస్మీట్ పెట్టారు.
పవన్ మాటల్లోనే...
ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. నేను రెండు చోట్ల ఓటమి చెందినా ఇచ్చిన మాటకు నిలబడతాను. ప్రజా సమస్యలపై మరింత బలమైన పోరాటం చేస్తాను. మరోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు. బలమైన మెజార్టీతో విజయం సాధించిన వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హార్ధిక శుభాకాంక్షలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీకు సొంతంగా మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ సారైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.
సమాజంలో మార్పు కోసం, క్లీన్ పాలిటిక్స్ లక్ష్యంగా 2014లో పార్టీ స్థాపించాం. న్యూ ఏజ్ పాలిటిక్స్ లక్ష్యంగా 25 సంవత్సరాల ప్రస్థానం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాం. అన్ని రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం ఉన్నాయి. అన్నింటికీ సిద్ధపడే ముందుకు వచ్చా. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి చేరువయ్యా. న్యూ ఏజ్ పాలిటిక్స్కు ఆహ్వానం పలుకుతూ జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
పార్టీ కోసం పని చేసిన జనసైనికులకు, విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా క్లీన్ పాలిటిక్స్ చేశాం. కొత్తతరం, యువతకు సీట్లు ఇచ్చాం. ఈ అంశాలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. అది భవిష్యత్ ప్రణాళికతో తీసుకున్న నిర్ణయం అని పవన్ కల్యాణ్ మూడు నిమిషాల్లో తన ప్రసంగం ముగించేశారు.