పవర్ స్టార్ ‘ఖుషి’ సినిమాకు 20 ఏళ్లు...

  • IndiaGlitz, [Tuesday,April 27 2021]

ఎస్.జె.సూర్య దర్వకత్వంలో శ్రీ సూర్య ఫిలింస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన సినిమా ‘ఖుషి’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కెరీర్‌కు ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. ఈ సినిమాతోనే పవన్‌కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. పవన్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ పవన్ అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘ఖుషీ’ కూడా ఒకటి కావడం విశేషం. ‘ప్రేమా గీమా లాంటి తొక్కలో సెంటిమెంట్లు పెట్టుకోలేదు, అందుకే, ఎంత ఆనందంగా ఉన్నానో’ అంటూ ఈ సినిమాలో పవన్ చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ యూత్ నోళ్లలో నానుతూనే ఉంటాయి.

‘బై బై యే బంగారు రమణమ్మ’ అంటూ పవన్ ఈ సినిమాలో స్వయంగా పాడి అభిమానులను అలరించారు. ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్‌గా భూమిక నటించింది. ఆమె నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రానికి రేణు దేశాయ్ కాస్ట్యూమ్స్ అందించడం మరో విశేషం. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏఎం రత్నం ట్విటర్ వేదికగా ఈ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘‘కొన్ని చిత్రాలు ఎవర్‌గ్రీన్, కొన్ని చిత్రాలు ట్రెండ్ సెట్టింగ్, కొన్ని చిత్రాలు కల్ట్ క్లాసిక్స్. ఇవన్నీ కలిపితే ఖుషి. ఈ సినిమాను మా బ్యానర్‌పై నిర్మించినందుకు గర్వంగా ఫీలవుతున్నా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి, ఎస్‌జె సూర్య గారికి ధన్యవాదాలు’’ అని ఏఎం రత్నం ట్వీట్ చేశారు.

కలకత్తాలోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్... హయ్యర్ స్టడీస్ కోసం కెనడా బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరతాడు. మరోవైపు కైకలూరులోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమితకి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాసి పెట్టి వెళ్లిపోతాడు. ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. దీంతో మధు తన తండ్రి నుంచి పర్మిషన్ తీసుకుని అదే విశ్వవిద్యాలయంలో చేరుతుంది. అక్కడ సిద్ధు, మధుమితల పరిచయం.. స్నేహితుల ప్రేమకు సాయమందిస్తూ వీరిద్దరూ ప్రేమలో పడటం వంటి సిద్దు ఇగో కారణంగా దూరమవడం.. చివరకు ఒక్కటవడం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది.