వీరాభిమాని కుమార్తెకు జనసేనాని నామకరణం
- IndiaGlitz, [Tuesday,June 25 2019]
సినీ నటులు, రాజకీయ నేతలకు ఎలాంటి వీరాభిమానులు ఉంటారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తాము అభిమానించే వారికోసం ఎంత పనైనా చేయడానికి సాహసాలు చేస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అభిమానానికి అవధుల్లేకుండా జరగరాని ఘోరాలు సైతం జరిగిపోతుంటాయ్. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజే వేరని చెప్పుకోవాలి. అభిమానులు సృష్టించుకోవాలన్నా.. ఉన్నవారిని బయటికెళ్లకుండా చూసుకోవాలన్నా పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా.. అందుకే ఆయన సినిమాల్లో ఆ రేంజ్కు ఎదిగారు. ఇక రాజకీయాల్లో పరిస్థితి ఏంటన్నది ఇక్కడ అప్రస్తుతం.. అనవసరం కూడా.
వీరాభిమాని కోరిక మన్నించి..!
ఇక అసలు విషయానికొస్తే... మంగళవారం నాడు తన వీరాభిమాని కుమార్తెకు జనసేనాని నామకరణం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యర్రం అంకమ్మరావుకు అనే వ్యక్తికి పవన్ అంటే పడి చచ్చేంత పిచ్చి. అంకమ్మరావు భార్య ఇందిర ఇటీవలే ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో తన బిడ్డకు నామకరణం చేయాలని పవన్కు విజ్ఞప్తి చేశారు. ఆయన కోరికను మన్నించిన పవన్ గుంటూరుకు రప్పించారు.
వెరైటీగా ‘వేద వినీష’..!
ప్రస్తుతం పవన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలోని పార్టీ కార్యాలయానికి రావాలని వీరాభిమానికి కబురు పంపారు. అభిమాన హీరో నుంచి పిలుపు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అంకమ్మరావు.. పవన్ దగ్గరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆ చిన్నారికి ‘వేద వినీష’ అనే పేరు పెట్టారు. అనంతరం ఆ శిశువును రెండు చేతుల్లోకి తీసుకుని లాలించారు. అయితే పవన్ తమ కుమార్తెను ఎత్తుకోవడంతో అంకమ్మరావు, ఇందిర దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా పవన్కు థ్యాంక్స్ చెప్పిన దంపతులు.. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తిరుగుపయనం చేశారు.