close
Choose your channels

Pawan Kalyan : జనసేనలో కోవర్టులు.. పక్కవాడికి సహకరిస్తే సస్పెన్షనే : నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

Tuesday, August 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2024 ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. టీడీపీ, వైసీపీల పల్లకిలు మోయడానికి తాను సిద్ధంగా లేనని.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం వుండాలని పవన్ కల్యాణ్ అన్నారు. అవసరమైతే ప్రత్యర్ధులతోనూ కలుస్తానని జనసేనాని బాంబు పేల్చారు. తాజాగా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఒకరిద్దరు కోవర్టులున్నారని.. తనను వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణా సంఘాన్ని నియమించుకుంటామన్న ఆయన.. పార్టీలో ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని తేల్చిచెప్పారు. జనసేనలో వుంటూ పక్కవాడికి సహకరించే పరిస్ధితి వుండకూడదని.. పార్టీలో వుంటూ ఏ ఒక్క తప్పు చేసినా సస్పెండ్ చేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పి కేసీఆర్ వ్యూహం మార్చారు:

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారని.. కానీ ఆయన మనసు మార్చుకున్నారని పవన్ గుర్తుచేశారు. అది వారి వ్యూహామని.. జనసేనలోనూ తమకు ప్రత్యేకమైన వ్యూహాలు వున్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాదయాత్ర చేసిన వారందరూ వినోభా భావేలు కారని.. ఆంథ్రా థానోస్‌గా మారిన వాళ్లూ వున్నారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎన్నికలకు వెళతామని ఆయన తెలిపారు.

ఆప్, బీజేపీలు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాయి:

ఏడాదికే వైసీపీ ప్రభుత్వంతో జనం విసిగిపోయారని.. ఎంతమంది సీఎంలు సీమ నుంచి వచ్చినా అక్కడి అభివృద్ధి జరగలేదని పవన్ ఎద్దేవా చేశారు. మద్య నిషేధం అని చెప్పి.. రెట్టింపు అమ్మకాలు చేపట్టారని, సంక్షేమ పథకాల పేరుతో పదివేలు ఇచ్చి ఇరవై వేలు వసూలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈసారి వైసీపీ అధికారంలోకి రాకూడదని.. ఏపీ భవిష్యత్‌కు సంబంధించి తాను చాలా స్పష్టంగా వున్నానని జనసేనాని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా ఎందుకు కలిశారో వాళ్లే చెప్పాలని.. చంద్రబాబు - మోడీ కూడా మాట్లాడుకున్నారని పవన్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిలో మూడో ప్రత్నామ్నాయంగా మారిందని.. బీజేపీ ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.