close
Choose your channels

వైసీపీ ప్రభుత్వంపై పవన్ ‘గురి’!

Saturday, August 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ప్రభుత్వంపై పవన్ ‘గురి’!

సెప్టెంబర్ 7వ తేదీనాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నందున ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ది వంటి విషయాలపై అధ్యయనం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు ఈ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఇప్పటివరకూ నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలపై సమీక్ష, ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల జరిగిన శ్రీ పవన్ కల్యాణ్ పర్యటన, రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై చర్చ జరిగింది. సెప్టెంబర్ మాసాంతానికి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలన్నింటినీ పూర్తి చేసి, పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈలోగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి వివరాలను క్రోడీకరించి సిద్ధపరచాలని, స్థానిక నాయకులకు తెలియచేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై అధ్యయనం చేయడానికి 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 30 మంది సభ్యులను నియమించారు.

సెప్టెంబర్ మూడో వారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రలోని అయిదు పార్లమెంట్ సెగ్మెంట్ల సమావేశాలు విశాఖపట్నంలోను, రాయలసీమలోని ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్ల సమావేశాలు రాయలసీమలోని ప్రధాన కేంద్రంలో నిర్వహిస్తారు. ఈ సమావేశాల అనంతరం అక్టోబర్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న సమావేశాలపై సమీక్షిస్తూ మనం ఎన్నికల్లో ఓటమికి గురైనా కార్యకర్తల్లో ధైర్యం ఏ మాత్రం సడలలేదని పవన్ కల్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరవుతున్న కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పార్టీ భావజాలంతో వారెంత మమేకమయ్యారో అర్థమవుతోందనీ, ఇప్పటి వరకూ జరిగిన సమావేశాలు తనకు సంతృప్తినిచ్చాయి అన్నారు.
ఆశావాహ దృక్పథంతో ఉన్న కార్యకర్తల మనసును గెలుచుకోవడానికి నాయకులు కొంత ఓర్పుతో పని చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. వారికి కష్టం ఉన్నప్పుడు మీకు అండగా మేమున్నాం అనే భరోసా ఇవ్వాలన్నారు.

తమను అలక్ష్యం చేశారనే భావన వారికి రానీయకూడదని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జనసేన కార్యకర్తలను వేధిస్తూ కేసులుపెడుతున్నందున, కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీలోని లీగల్ విభాగాన్ని బలోపేతం చేయాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రతి జిల్లాలోను లీగల్ బృందాలను కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.