Pemmasani:జగన్ అరాచకపాలనను అరికడతాం.. ప్రజలకు పెమ్మసాని భరోసా..

  • IndiaGlitz, [Sunday,April 14 2024]

జగన్ అరాచక పాలనను అరికడతామని.. ప్రజలకు టీడీపీ జెండా అండగా ఉంటుందని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్లో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చర్మకారులను, చిరు వ్యాపారులు, నివాసితులను పెమ్మసాని కలుసుకున్నారు. వృత్తి పరమైన, స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీ స్థానిక నాయకుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇంటి పట్టాలు, తాగునీటి సమస్యలు, పెరిగిన కరెంటు చార్జీలు తదితర సమస్యలను ప్రజలు పెమ్మసాని ముందు ఏకరువు పెట్టారు. ఇక ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కేవలం రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సమస్యలపై, గతంలో టిడిపి తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కాసేపు మాట్లాడుకున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో అనతి కాలంలోనే పెమ్మసాని ప్రజల్లోకి దూసుకువెళ్ళారని.. అండగా ఉంటామని భరోసా ఇవ్వగలిగిన నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ సందర్భంగా ఆనంద్ బాబు తెలిపారు.

ఈ కార్యక్రమాల అనంతరం గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఎంపీగా పెమ్మసానిని భారీ మెజార్టీతో గెలపించాలని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు.