కరోనా నుంచి కోలుకున్నవారు టీకా కోసం 6 నెలలు ఆగాల్సిందే..

  • IndiaGlitz, [Thursday,May 13 2021]

ప్రస్తుతం భారత్‌లో రెండు రకాల టీకాలను ప్రజలకు ఇస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజానీకానికి అందజేస్తోంది. అయితే ఈ టీకాల డోసుల  మధ్య వ్యవధి సహా పలు విషయాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని గతంలో 28 రోజుల నుంచి 6-8 వారాలకు కేంద్రం పొడిగించింది. అయితే  కేంద్రం  12 నుంచి 16 వారాలకు పెంచవచ్చని గురువారం నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే కొవాగ్జిన్ విషయంలో మాత్రం ఎలాంటి సూచనలూ చేయలేదు.

కాగా.. కరోనా వ్యాక్సిన్‌ను గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నవారి విషయంలో కూడా నిపుణుల ప్యానెల్ ప్రత్యేక సూచనలు చేసింది. గర్భిణులు, బాలింతలు సైతం కొవిడ్ టీకాను వేయించుకోవచ్చని నిపుణుల ప్యానెల్ వెల్లడించింది. అయితే కరోనా నుంచి కోలుకున్నవారు మాత్రం 6 నెలలు ఆగిన తర్వాత మాత్రమే టీకా వేయించుకోవాలని సూచించింది. ఇప్పటికే దేశంలో 17.72 కోట్ల మంది కొవిడ్ టీకాను వేయించుకున్నారు.