Pratinidhi 2:'ఓటేయండి లేకపోతే చచ్చిపోండి'.. ఆకట్టుకుంటున్న 'ప్రతినిధి2' టీజర్..

  • IndiaGlitz, [Friday,March 29 2024]

నారా రోహిత్ చాలా కాలం తర్వాత తిరిగి హీరోగా నటించిన మూవీ 'ప్రతినిధి2'. 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీ 'ప్రతినిధి' సినిమా సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. టీజర్ మొత్తం ఏపీ రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఈ మూవీలో రోహిత్ జర్నలిస్ట్‌గా కనిపిస్తున్నారు.

జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలోనే బతుకుతాం అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. పైన కూర్చొని ఎన్ని అయినా చెబుతారు నీతులు.. మేము ఖర్చు పెట్టింది ఎవడిస్తాడు.. వాడా, వాడమ్మా మొగుడా అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓ మంత్రిని ఇంటర్వ్యూ చేస్తూ మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్ అని హీరో రోహిత్ అడిగగా.. సుమారు రూ.5లక్షల కోట్లు ఉండొచ్చు అంటూ ఆ మంత్రి సమాధానమిస్తాడు. మరి అది తీర్చాలంటే ఎంత టైమ్ పడుతుంది సార్ అంటూ ప్రశ్నిస్తే అభివృద్ధి ఉంటే అది ఎంత సేపు అబ్బా అని మంత్రి చెప్పగా.. అది ఎక్కడుంది సార్ అంటూ హీరో కౌంటర్ ఇస్తాడు.

ఇక టీజర్ చివరిలో కూడా ఓ డైలాగ్‌తో ముగించారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ఒళ్లు విరిచి బయటికొచ్చి ఓటేయండి.. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి.. అదీ కుదరకపోతే చచ్చిపోండి అంటూ రోహిత్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మొత్తానికి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆధారంగా ఈ సినిమా తీసినట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. శ్రీరామనవమి పండుగ కానుకగా ఏప్రిల్‌ నెలలో మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల వేళ విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.